IT Companies: ఒక్కరోజే రూ.225 కోట్ల నష్టం.. ఆందోళనలో ఐటీ కంపెనీలు.. సీఎంకు సీరియస్ లేఖ..
IT Companies: ఇండియన్ సిలికాన్ వ్యాలీకి కొత్త కష్టాలు వచ్చాయి. ప్రస్తుతం ఇది ఐటీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా తరువాత కోలుకుంటున్న తరుణంలో ఇబ్బందులపై ఆవేదన చెందుతున్నాయి. విషయం ఏమిటంటే.. గతవారం బెంగళూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ స్తంభించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ వర్షాల ఐటీ కంపెనీలకు ఒక్కరోజే ఏకంగా కోట్లలో నష్టం వచ్చింది. దీనిపై ఐటీ కంపెనీల సంఘం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాసింది.
|
భారీ వర్షం కారణంగా..
బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమ ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వచ్చారని ఐటీ కంపెనీలు తమ లేఖలో తెలిపాయి. ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంగా విలువైన పనిగంటలు వృధా అయ్యాయని వెల్లడించాయి. అలా తమకు రూ.225 కోట్ల నష్టం వచ్చిందని ఐటీ కంపెనీలు పేర్కొన్నాయి.
|
వరద నీటిలో ORR రోడ్..
ముఖ్యంగా బెంగళూరులోని ప్రధాన ఐటీ కంపెనీలు ఉన్న ఓఆర్ఆర్ రోడ్డుపై వరద నీరు ప్రవహించడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు దాదాపుగా 5 గంటల పాటు విధులకు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. ఈ కారణంగా ఊహించని రీతిలో నష్టపోయినట్లు కంపెనీలు అక్కడి ప్రభుత్వానికి తెలిపాయి.
|
అధ్వానంగా మౌలికసదుపాయాలు..
ఓఆర్ఆర్ రోడ్డులో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయని, దీంతో కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వానికి తమ గోడును కంపెనీలు వెల్లబుచ్చాయి. ప్రస్తుతం విపరీతమైన వృద్ధిని సాధిస్తున్న బెంగళూరు మౌలిక సదుపాయాల సామర్థ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు నష్టాలు రాకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
|
ఆర్థిక నష్టంపై కర్ణాటక సీఎం..
ఐటీ కంపెనీలతో సహా అన్ని కంపెనీలకు ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా చూడడం ప్రభుత్వ కర్తవ్యమని, తద్వారా బెంగళూరు నగరం, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాలని లేఖలో టెక్ కంపెనీలు కోరటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజధానిలో వర్షాలు, నీరు నిలిచిపోవటం కారణంగా జరిగిన నష్టాలు, పరిహారంపై చర్చిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి చెప్పారు.
మెట్రో వేగవంతం చేసేందుకు..
కొత్త మెట్రో నిర్మాణం ఇటీవలే ప్రారంభమైనా చాలా నెమ్మదిగా సాగుతోంది. కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ప్రారంభించిన రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐటీ కంపెనీల సంఘం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని లేఖలో కోరింది. బెంగుళూరులో రోడ్డు నిర్మాణ పనులను మెరుగుపరచడానికి తక్షణ చర్యలు అవసరమని వారు కోరారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఆగిపోయిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కంపెనీలతో పాటు వాహనదారులు సైతం అంటున్నారు.