కేంద్ర బడ్జెట్కు గడువు మరో రెండు రోజులే! ఇప్పటికే దేశంలోని అన్ని వర్గాల నుంచి బడ్జెట్పై పలు సూచనలు, సలహాలు అందాయి. సామాన్యుల నుంచి సంపన్న వర్గాల వరకు కేంద్ర బడ్జెట్పై కొన్ని అంచనాలు, మరిన్ని ఆశలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు.
అయితే ఈసారి కేంద్ర బడ్జెట్ గత పదేళ్లలోనే అత్యంత కష్టతరమైనదని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, అటు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక మాంద్యంతోపాటు ఇటు దేశంలోని ఆర్థిక మందగమనం, ప్రతికూల పరిస్థితులను ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్కు సవాళ్లు తప్పవని అంటున్నారు.

జీడీపీ వృద్ధి రేటు భారీ పతనం...
దేశ ప్రగతికి కారణమయ్యే జీడీపీ వృద్ధిరేటు భారీగా పతనం కావడం దేశ ఆర్థిక రంగం ప్రగతికి పెద్ద అడ్డుగోడలా మారింది. ప్రస్తుతం మన దేశ జీడీపీ వృద్ధిరేటు(5 శాతం) పదకొండేళ్ల కనిష్టానికి పడిపోయింది. పీవీటి వినిమయం కూడా 5.8 శాతానికి పడిపోయి ఏడేళ్ల కనిష్టానికి చేరింది. అలాగే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు(2.8 శాతం) నాలుగేళ్ల కనిష్టానికి చేరింది. తయారీ రంగం వృద్ధి రేటు 2 శాతం మాత్రమే ఉంది. ఇది గత పదిహేనేళ్లలో అత్యంత కనిష్టంగా చెబుతున్నారు. ఇక పెట్టుబడుల వృద్ధి అయితే కేవలం 1 శాతమే. గత పదిహేడేళ్లలో ఈ రంగంలో వృద్ధి రేటు ఇంత నెమ్మదిగా ఎన్నడూ లేదని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు...
ప్రస్తుతం దేశంలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ) ద్రవ్యోల్బణం డిసెంబర్లో అత్యంత వేగంగా పెరిగి 7.35 శాతానికి చేరింది. కూరగాయల ధరల పెరుగుదల కూడా ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీసింది. ఈ ద్రవ్యోల్బణం తగ్గే వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లను కూడా తగ్గించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోని అంశాలు కూడా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ద్రవ్యలోటు అంచనాలు కూడా కొంత మేర గతి తప్పాయి. బడ్జెట్లో ద్రవ్యలోటును 3.3 శాతం లక్ష్యంగా పెట్టుకోగా అది 3.8 శాతంగా నమోదైంది. ఇక వచ్చే బడ్జెట్లో కచ్చితంగా పూర్తి చేయాల్సిన అంశాల ప్రభావం కూడా పడితే ఈ ద్రవ్యలోటు మరింతగా పెరిగిపోతుంది.

అప్పులు మరింత పెంచే మూలధన వ్యయాలు...
మనది వినియోగం, వినిమయంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో వనరుల సమీకరణ అనేది పెద్ద సవాలే. మరోవైపు వ్యయాలను కట్టడి చేయలేని పరిస్థితి. ఫలితంగా ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయక తప్పదు. అయితే దేశ ఆర్థిక రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు రుణ లభ్యతపైనా తీవ్ర ప్రభావం చూపాయి. గత ఏడాది బ్యాంకులు కూడా పెద్దగా రుణాలు ఇవ్వలేదు. ఈ ప్రభావం కూడా కొనుగోలు శక్తిపై పడింది. గతంతో పోల్చుకుంటే 2019లో బ్యాంకుల రుణ మంజూరు 7.1 శాతం తక్కువగా ఉంది. గత పదేళ్లలో ఇంత అత్యల్ప స్థాయికి చేరడం ఇది రెండోసారి. మరోవైపు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రాయితీలు వినియోగదారులకు బదిలీ చేయడంలో బ్యాంకులు తీవ్ర జాప్యం చేయడం వల్ల కూడా తక్కువ వడ్డీకి రుణాలు రాని పరిస్థితి నెలకొంది.

పడిపోయిన పన్ను వసూళ్లు...
దేశంలో ఆర్థిక మందగమనం కారణంగా సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయింది. దీంతో కొనుగోళ్లు లేక జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పడిపోయింది. దీనికితోడు ఈ ఏడాది ఆదాయపు పన్ను వసూళ్లు కూడా తగ్గాయి. ఇలా పన్ను వసూళ్లు పడిపోవడం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఒకవేళ వచ్చే ఏడాది కూడా ఈ ప్రతికూల పరిస్థితులే కొనసాగితే.. అప్పటి పరిస్థితులను కూడా ఎదుర్కొనే విధంగా రాబోయే బడ్జెట్ ప్రణాళిక ఉండాలి. ఆదాయపు పన్ను వసూళ్లు తగ్గిన మేరకు కొనుగోళ్లు పెరిగి పరోక్ష పన్నులు వసూలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలి. లేదంటే కొనుగోళ్లు మరింత క్షీణించిపోవచ్చు.

భారీ మార్పులు, ప్రమాద ఘంటికలు...
ఇక దేశంలో నిరుద్యోగం రేటు విపరీతంగా పెరిగి నలభై ఏళ్ల గరిష్ఠానికి చేరుకుంది. కొనుగోళ్లు క్షీణించడంతో ఆటోమొబైల్ పరిశ్రమ కూడా కుదేలయింది. ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన కోడ్ను గత ఏడాది పార్లమెంట్ ఆమోదించింది. గతంలో ఉన్న 44 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్లలోకి మర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మార్పులన్నీ పూర్తిగా జరగడానికి, అమలులోకి రావడానికి మరింత సమయం పడుతుంది. వృద్ధి అంచనాలు కూడా అత్యంత స్వల్పంగా ఉండడం దేశ ఆర్థిక రంగంలో ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర బడ్జెట్ చాలా కష్టతరంగా ఉండొచ్చని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications