అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకాంశంగా మారాయి. ఇరాన్తో జరిపిన సంభాషణలు 'ఫలవంతంగా' సాగాయని, త్వరలోనే ఒక ప్రధాన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే, ఈ వార్తలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది.
బాంబు దాడులు ప్రారంభమైన గత 24 రోజుల్లో అమెరికాతో తాము ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ట్రంప్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు కేవలం 'మానసిక యుద్ధం'లో భాగమేనని, ఆర్థిక మార్కెట్లను ప్రభావితం చేయడానికి ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘర్షణకు ప్రధాన కేంద్రబిందువుగా ఉన్న హార్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ తన వ్యూహాన్ని కొంత మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించిన ఆయన.. తాజాగా తన గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తన రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇరాన్ ప్రతినిధులతో అత్యంత బలమైన చర్చలు జరిపారని ఆయన పేర్కొన్నారు.
ఈ గడువు ముగిసేసరికి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక మంచి ఒప్పందం కుదురుతుందని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా వైపు నుండి రాజీ సంకేతాలు వస్తున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు కొనసాగుతూనే ఉండటం గమనార్హం.
మరోవైపు, ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా మాటలు కలవకపోయినా, తెరవెనుక పాకిస్తాన్, ఈజిప్ట్, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్తో ట్రంప్ మాట్లాడినట్లు సమాచారం. ఈ వారంలో ఇస్లామాబాద్లో అమెరికా - Iran అధికారుల మధ్య రహస్య భేటీ జరిగే అవకాశం ఉందని..జేడీ వాన్స్ వంటి కీలక నేతలు ఈ చర్చల్లో పాల్గొనవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ చర్చల వివరాలను అధికారికంగా ధృవీకరించడానికి వైట్ హౌస్ నిరాకరించింది.
యుద్ధం కారణంగా ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో ఆర్థిక మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్ముజ్ జలసంధి వాస్తవంగా మూసివేయబడటం వల్ల ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందనే భయాలు పెరిగాయి. ట్రంప్ చర్చల ప్రకటన తర్వాత చమురు ధరలు కొంత తగ్గినప్పటికీ, పరిస్థితి ఇంకా అస్థిరంగానే ఉంది.
ఇరాన్ మాత్రం గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా సైనిక ఉనికిని అంతం చేయాలని.. యుద్ధ నష్టానికి పరిహారం చెల్లించాలని పట్టుబడుతోంది. ఈ కఠినమైన డిమాండ్ల మధ్య, ట్రంప్ ఆశిస్తున్న 'సమగ్ర పరిష్కారం' ఎంతవరకు సాధ్యమవుతుందనేది ఈ ఐదు రోజుల గడువు ముగిసిన తర్వాతే తేలనుంది.


Click it and Unblock the Notifications