Iran war: యుద్ధం రూటు మారింది! టెక్ కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ప్లాన్!
మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా.. పెద్ద పెద్ద కంపెనీల ఆఫీసులు, బ్యాంకుల వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైనిక దళమైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) తాజాగా విడుదల చేసిన ఒక హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల కార్యాలయాలు తమ తదుపరి లక్ష్యాలని ఇరాన్ బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆర్థిక కేంద్రాలే లక్ష్యంగా యుద్ధం
సాధారణంగా యుద్ధం అంటే సైనిక స్థావరాలపై దాడులు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తన పంథా మార్చింది. దీనిని 'ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వార్' (మౌలిక సదుపాయాల యుద్ధం) గా ఇరాన్ పేర్కొంటోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక ప్రధాన బ్యాంకుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపిన తర్వాత, ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంస్థలకు సంబంధించిన ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులు తమ హిట్ లిస్టులో ఉన్నాయని IRGC స్పష్టం చేసింది. అంతేకాదు బ్యాంకుల సమీపంలో ఉండే సాధారణ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, కనీసం ఒక కిలోమీటరు దూరం పాటించాలని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
టెక్ దిగ్గజాలకు ఎందుకు ముప్పు?
ఇరాన్ విడుదల చేసిన కొత్త 'టార్గెట్ లిస్ట్' లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఒరాకిల్, ఐబిఎమ్ వంటి దిగ్గజ కంపెనీల పేర్లు ఉన్నాయి. వీటికి ఇజ్రాయెల్ తో ఉన్న సంబంధాలు , వీటి టెక్నాలజీ సైనిక అవసరాలకు వాడుతున్నారనేది ఇరాన్ ప్రధాన ఆరోపణ. గల్ఫ్ దేశాలైన దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్ నగరాల్లో ఉన్న ఈ కంపెనీల డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు తమ దాడుల పరిధిలోకి వస్తాయని ఇరాన్ అనుబంధ వార్తా సంస్థ 'తస్నీమ్' వెల్లడించింది. ఇప్పటికే బహ్రెయిన్, యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగినట్లు వార్తలు రావడం ఐటీ రంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
సామాన్యులపై ప్రభావం
ఈ యుద్ధం వల్ల కేవలం సైనిక నష్టమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడేలా కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉండే బ్యాంకులు, డేటా సెంటర్లు దెబ్బతింటే.. ఆన్ లైన్ లావాదేవీలు, క్లౌడ్ సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్యాంకులు తమ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు ధరలు పెరగడంతో పాటు డిజిటల్ సేవలలో అంతరాయాలు తలెత్తి సామాన్యుడి జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే.. ఈ పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య గొడవగా మిగిలిపోలేదు. ప్రపంచ దేశాల ఆర్థిక మూలాధారాలైన టెక్నాలజీ, బ్యాంకింగ్ వ్యవస్థలను దెబ్బతీసే దిశగా అడుగులు పడుతున్నాయి. అమెజాన్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే తమ భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ 'ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వార్' మరెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications