అమెరికా సీన్ అయిపోయింది.. ఒక్క అణుబాంబు వేయడమే మిగిలుంది.. ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..
ఇరాన్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. టెహ్రాన్ డిప్యూటీ మేయర్, ఇరాన్ సంప్రదింపుల బృంద నిపుణుడు హమీద్రేజా ఘోలంజాదే అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా వద్ద ఉన్న సంప్రదాయ సైనిక మార్గాలన్నీ ముగిసిపోయాయని.. ఇప్పుడు వాషింగ్టన్కు అణుదాడి తప్ప మరో ప్రత్యామ్నాయం మిగలలేదని ఆయన తెలిపారు.
అమెరికా ఎంతటి సైనిక చర్యలకు దిగినా, ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ తన పోరాటాన్ని ఆపబోదని.. మరింత పట్టుదలగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులు చేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఘోలంజాదే స్పందిస్తూ.. శత్రు దేశాలు ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించాలని ముందే ప్రణాళికలు వేసుకున్నప్పటికీ, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలివచ్చిన స్థానిక ప్రజలను, అంతర్జాతీయ ప్రతినిధులను చూసి భయపడి వెనక్కి తగ్గాయని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుందని.. నివాళులర్పించేందుకు జనం ఇంకా తరలివస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

మరోవైపు ప్రపంచ దేశాలకు కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రపంచ నౌకా రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన ఈ వ్యూహాత్మక జలమార్గం ప్రస్తుతానికి తెరిచే ఉంటుందని ఘోలంజాదే ప్రకటించినప్పటికీ.. ఒక పెద్ద హెచ్చరికను జారీ చేశారు. మరో 60 రోజుల తర్వాత ఈ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ పన్ను విధిస్తుందని.. ఈ ప్రాంతానికి అంతర్జాతీయ చట్టాలు వర్తించవని ఆయన తేల్చి చెప్పారు. ఖమేనీ మరణానికి కారణమైన వైమానిక దాడి తర్వాత ఇరాన్ ఈ జలమార్గంపై తన పట్టును మరింత కఠినతరం చేసింది. నౌకల నుండి శాశ్వతంగా రవాణా రుసుములు వసూలు చేసేలా ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి టెహ్రాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ పరిణామాల మధ్య అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు పూర్తిగా ప్రతిష్టంభనకు గురయ్యాయి. చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని, ఈ విషయం ఇరు దేశాలకూ స్పష్టంగా తెలుసని ఘోలంజాదే వెల్లడించారు. ఇరుపక్షాల మధ్య గతంలో ఒక తాత్కాలిక అవగాహన కుదిరినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్రిక్తతలు సద్దుమణగలేదు. దీనికి నిదర్శనంగా, హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కనీసం రెండు క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు.
ఈ దాడిలో రెండు నౌకలు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అయితే, ఈ దాడులు హార్ముజ్ జలసంధిలో దాడులను నిలిపివేయడానికి మూడు వారాల క్రితం కుదిరిన అవగాహనను, అలాగే ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన వారం రోజుల శాంతి ఒప్పంద గడువు ముగిసిన వెంటనే జరగడం అంతర్జాతీయంగా ఆందోళనలు పెంచుతోంది. Iran వైఖరి, ఈ క్షిపణి దాడులు పశ్చిమ ఆసియాను మరో పెద్ద ఘర్షణ వైపు నెడుతున్నాయి.


Click it and Unblock the Notifications
