అమెరికా స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్.. బతికుండాలంటే ఇక్కడి నుండి వెంటనే పారిపోండి అని తీవ్ర హెచ్చరిక..
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. దక్షిణ ఇరాన్పై అంతకుముందు అమెరికా జరిపిన వైమానిక దాడులకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అత్యంత వేగంగా, తీవ్రంగా ప్రతిస్పందించింది. బహ్రెయిన్లో ఉన్న అమెరికాకు చెందిన అత్యంత వ్యూహాత్మక 'ఐదవ నౌకాదళం' (Fifth Fleet) పై, అలాగే జోర్డాన్లోని ఒక ప్రముఖ అమెరికా వైమానిక స్థావరంపై తాము క్షిపణి దాడులు చేసినట్లు ఐఆర్జీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతీకార దాడుల పరంపర అంతటితో ఆగకుండా, తమ దేశంపై కూడా ఇరాన్ దళాలు దాడికి దిగాయని పొరుగు దేశమైన కువైట్ వెల్లడించడంతో గల్ఫ్ రీజియన్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
గత సోమవారం అంతర్జాతీయ నౌకాయాన మార్గమైన హార్ముజ్ జలసంధిలో గస్తీ కాస్తున్న అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ దళాలు డ్రోన్ ద్వారా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ప్రతికారంగానే తాము ఇరాన్లోని వ్యూహాత్మక వాయు రక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని "ఆత్మరక్షణ దాడులు" జరిపినట్లు అమెరికా సైనిక కేంద్ర కమాండ్ (CENTCOM) స్పష్టం చేసింది. అయితే, ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి దీనిపై అంతకుముందు అంతర్జాతీయ మీడియా సంస్థ 'అల్ జజీరా'తో మాట్లాడుతూ, తమ దళాలు ఉద్దేశపూర్వకంగా అమెరికా హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకోలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

అయితే అమెరికా నేరుగా ఇరాన్ భూభాగంపై దాడులకు తెగబడటంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా తమ దేశ సంకల్పాన్ని, సైనిక శక్తిని పరీక్షించడానికే ఇలాంటి దాడులకు ఒడిగట్టిందని, శత్రువుల నుండి వచ్చే ఎలాంటి దాడినైనా, బెదిరింపునైనా తిప్పికొట్టడానికి ఇరాన్ సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. "అమెరికా సైనికులు సురక్షితంగా ఉండాలని అనుకుంటే, వెంటనే మా ప్రాంతాన్ని (మధ్యప్రాచ్యాన్ని) విడిచిపెట్టి వెళ్ళిపోవాలి" అంటూ అరాఘ్చి హెచ్చరించారు.
మరోవైపు, ఇటు లెబనాన్, గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైతం తన దాడుల తీవ్రతను పెంచింది. మంగళవారం దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 20 మంది మరణించారు. మరింత పెద్ద ఎత్తున సైనిక చర్యకు ప్రణాళికలు రచిస్తున్న ఇజ్రాయెల్, ఆయా ప్రాంతాల నుండి ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలంటూ బలవంతపు తరలింపు ఉత్తర్వులు జారీ చేయడంతో వేలాది మంది పౌరులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోతున్నారు. ఇటు ముట్టడిలో ఉన్న గాజాలోనూ మానవీయ సంక్షోభం తీవ్రమైంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న సుమారు 16,500 మందికి పైగా పాలస్తీనియన్లు విదేశాలకు వెళ్లి వైద్య చికిత్స తీసుకోకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందని, ఈ చికిత్స జాప్యం ద్వారా ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే రోగులను చంపుతోందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది.
యుద్ధ వాతావరణం నడుమ ఇరాన్ ప్రభుత్వం తన దేశంలోని అంతర్గత భద్రతపై కూడా ఉక్కుపాదం మోపింది. విదేశీ శత్రు నెట్వర్క్లతో సంబంధాలు కలిగి ఉండి, దేశవ్యాప్తంగా భద్రతా వ్యతిరేక నిరసనలలో పాల్గొన్న 47 మంది వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. ఇరాన్లోని ఉత్తర కోహ్రాసన్ ప్రావిన్స్ ప్రధాన న్యాయమూర్తి హోజ్జతోలెస్లామ్ రెజా బరతిజాదే ఈ వివరాలను వెల్లడిస్తూ, నిఘా పర్యవేక్షణ అనంతరం శత్రువులతో చేతులు కలిపిన వారిపై 14 కేసులు నమోదు చేసి, ఆస్తుల జప్తుకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రస్తుతం జర్మనీ, ఇంగ్లాండ్, టర్కీ, అమెరికా, ఖతార్ వంటి వివిధ దేశాలలో నివసిస్తున్న ఈ వ్యక్తులపై "ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార కార్యకలాపాలు", "అంతర్గత, బాహ్య భద్రతకు విఘాతం కలిగించేలా కుట్ర పన్నడం" వంటి దేశద్రోహ అభియోగాల కింద దర్యాప్తు జరుగుతోందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) పేర్కొంది.


Click it and Unblock the Notifications
