హార్ముజ్ జలసంధి వద్ధ మళ్లీ హైడ్రామా.. మూసివేతపై ప్రపంచ దేశాలు ఆందోళన.. ఇరాన్ రియాక్షన్ ఏంటంటే..
హార్ముజ్ జలసంధిని తాము మూసివేయలేదని, ఈ కీలక జలమార్గం గుండా వాణిజ్య నౌకాయానం యథావిధిగా కొనసాగుతోందని ఇరాన్ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 18న అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనల ప్రకారమే ఇక్కడ రవాణా జరుగుతోందని ఇరాన్ స్పష్టం చేసింది.
ప్రభుత్వ ప్రసార సంస్థ 'ప్రెస్ టీవీ'తో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ.. జలసంధి మూసివేతపై వస్తున్న వార్తలను పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధాలుగా కొట్టిపారేశారు. అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి టెహ్రాన్ అన్ని అవసరమైన చర్యలు తీసుకుందని, ప్రస్తుతం నౌకల రాకపోకలు సాధారణంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఇరాన్ అధికారిక ప్రకటనకు భిన్నంగా కొన్ని అంతర్జాతీయ మీడియా నివేదికలు ఒక దిగ్భ్రాంతికరమైన వార్తను వెల్లడించారు. ఇరాన్ నౌకాదళంతో పాటు ఆ దేశ అత్యంత భయంకరమైన సైనిక సంస్థ అయిన ఐఆర్జిసి, సముద్ర రేడియో ఛానెళ్ల ద్వారా హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు కఠినమైన హెచ్చరికలు జారీ చేశాయని ఆ నివేదికలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య బుధవారం కుదిరిన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండటం లేదని ఇరాన్ ఆరోపిస్తోంది.
లెబనాన్ నుండి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని, సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, అలాగే పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని అమెరికా దళాలు ఖాళీ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ షరతులు నెరవేరే వరకు ఏ నౌక అయినా ఈ మార్గానికి సమీపించవద్దని, ఆదేశాలను ధిక్కరిస్తే నేరుగా లక్ష్యంగా చేసుకుని పేల్చివేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించినట్లు మీడియా పేర్కొంది.
ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో సుమారు 20 శాతం సరఫరా ఈ హార్ముజ్ జలసంధి మార్గం ద్వారానే జరుగుతుంది కాబట్టి దీనికి అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల కారణంగా ఈ మార్గం తాత్కాలికంగా మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరోసారి తీవ్ర ఆర్థిక సంక్షోభం మరియు యుద్ధ వాతావరణంలోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య శత్రుత్వం ముగియాల్సి ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్ నగరాలపై భారీ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ దాడుల్లో 18 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. తమ సైన్యం అవసరమైనంత కాలం లెబనాన్లోనే ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించగా, ఆ దేశ అతివాద మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ లెబనాన్ మొత్తం తగలబడిపోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ స్పందిస్తూ, ఇజ్రాయెల్ ప్రభుత్వం మానవాళి మొత్తానికి ముప్పని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని తాము ఇప్పటికే అధికారికంగా ఎత్తివేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. సముద్ర పర్యవేక్షణ సంస్థ 'ఏఎక్స్ఎస్ మెరైన్' నివేదిక ప్రకారం, గురువారం ఈ మార్గం గుండా రికార్డు స్థాయిలో 25 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయి, ఇది గత రెండు నెలల్లోనే అత్యధిక సంఖ్య కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications
