హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క చుక్క కూడా ఎగుమతి కాదు.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..
Iran-Hormuz Crisis: ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే మొత్తం ముడి చమురులో ఐదో వంతుకు వేదికైన వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ సంక్షోభం తీవ్ర రూపాన్ని దాల్చింది. హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా పదేపదే ప్రకటించుకుంటున్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్పై అమెరికా సాగిస్తున్న ఆర్థిక దిగ్బంధనం కొనసాగితే హార్ముజ్ జలసంధి నుంచి లేదా పర్షియన్ గల్ఫ్లోని ఏ ఇతర ప్రాంతం నుంచైనా ఒక్క చుక్క చమురును కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుని ఆర్థిక యుద్ధం ప్రకటిస్తామని టెహ్రాన్ సోమవారం స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ, తీవ్రవాద ధోరణి కలిగిన నాయకుడు మొహ్సెన్ రెజాయీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X) ద్వారా పశ్చిమ దేశాలకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఐదు నెలలకు పైగా ఇరాన్పై అమెరికా సాగిస్తున్న సైనిక, ఆర్థిక ఒత్తిళ్లకు ఇతర దేశాలేవీ మద్దతు ఇవ్వకూడదని కోరారు. ఇరాన్ ప్రజలపై వాషింగ్టన్ సాగిస్తున్న వినాశకర విధానాలకు ఏ దేశమైనా సహకరిస్తే, ఆ చర్యను తమపై నేరుగా యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని హెచ్చరించారు.

గత ఫిబ్రవరి 28న ఇరు దేశాల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలమార్గం దిగ్బంధంలోనే ఉంది. దీనివల్ల ప్రపంచ సరఫరా గొలుసుకు తీవ్ర విఘాతం కలిగి, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతున్నాయి. ఈ ఒత్తిడి వల్లే ట్రంప్ యంత్రాంగంపై మిత్రదేశాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హార్ముజ్ ద్వారా రాకపోకలను పునరుద్ధరిస్తే ఇరాన్పై శత్రుత్వాన్ని విరమించుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని నివేదికలు పేర్కొంటున్నప్పటికీ.. జలసంధిపై తమదే సంపూర్ణ ఆధిపత్యమని ట్రంప్ పునరుద్ఘాటిస్తున్నారు.
మరోవైపు నౌకల సురక్షిత ప్రయాణం, నిర్వహణ రుసుముల వసూలుపై ఇరాన్, ఒమన్ దేశాలు ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఒమన్ అడ్డుపడితే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ ఇటీవల ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో బెదిరించినప్పటికీ.. ఒమన్ దీనిపై ఇంకా ఎలాంటి రాతపూర్వక వివరణ ఇవ్వలేదు. గత 48 గంటల్లో హార్ముజ్ జలసంధిలో సైనిక దాడులు నమోదు కాలేదని నివేదికలు చెబుతున్నప్పటికీ.. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కారణంగా సుమారు 70 వాణిజ్య నౌకలను అమెరికా సైన్యం దారి మళ్లించడం ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది.
అమెరికా ఇరాన్పై మరిన్ని కఠినమైన ఆంక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజా హెచ్చరిక వెలువడింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్.. ఇరాన్పై 'ఎకనామిక్ డీ-డే' పేరుతో భారీ ఆర్థిక చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని సంకేతాలు ఇచ్చింది. హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. ఈ మార్గంలో రవాణాకు అంతరాయం ఏర్పడితే చమురు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇప్పటికే హార్ముజ్లో ట్యాంకర్ రాకపోకలు గణనీయంగా తగ్గాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఆసియా మార్కెట్లలో శుద్ధి చేసిన ఇంధనాల సరఫరాపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. అమెరికా కొత్త ఆంక్షల ప్రకటన కోసం మార్కెట్లు ఎదురుచూస్తుండగా, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 93 డాలర్లకు పైగా, WTI ధర 86 డాలర్లకు పైగా నమోదైంది.
హార్ముజ్లో చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడితే భారత్ వంటి భారీ చమురు దిగుమతి దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి, ద్రవ్యోల్బణం, పెట్రోల్-డీజిల్ ధరలపై ఒత్తిడి రావచ్చు. అయితే తుది ప్రభావం చమురు సరఫరాలో ఏర్పడే అంతరాయం ఎంతకాలం కొనసాగుతుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ హెచ్చరికతో ప్రపంచ ఇంధన మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అమెరికా ఆంక్షలు, ఇరాన్ ప్రతిస్పందన, హార్ముజ్లో నౌకల రాకపోకలు.. ఈ మూడు అంశాలు రాబోయే రోజుల్లో చమురు ధరల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.


Click it and Unblock the Notifications
