ఇరాన్ చేతిలో అణుబాంబు కంటే అత్యంత శక్తివంతమైన ఆయుధం..హార్ముజ్పై బాంబు పేల్చిన అమెరికా..
ఈ వారం చివర్లో అధికారికంగా ఒక ఫ్రేమ్వర్క్ శాంతి ఒప్పందంపై సంతకం జరగాల్సి ఉన్నప్పటికీ, హార్ముజ్ జలసంధిపై ఇరాన్కు ఉన్న వ్యూహాత్మక నియంత్రణపై అమెరికా నిఘా సంస్థలు సంచలన అంచనాలను వెలువరించాయి. ఇరాన్కు ఇప్పుడు తన ఇష్టానుసారం ఈ జలసంధిని సమర్థవంతంగా మూసివేసే సామర్థ్యం ఉందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి టెహ్రాన్కు ఒక శక్తివంతమైన సాధనాన్ని అందించిందని సిఎన్ఎన్ (CNN) నివేదిక పేర్కొంది.
ప్రపంచ చమురు , ద్రవీకృత సహజ వాయువు (LNG) ఎగుమతులలో అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని మూసివేసే ఉద్దేశం, సైనిక సామర్థ్యం రెండింటినీ ఇటీవలి సంఘర్షణల సమయంలో ఇరాన్ నిరూపించుకుందని నిఘా వర్గాలు తెలిపాయి. అమెరికా నిఘా అంచనాల గురించి తెలిసిన ఒక మూలం ప్రకారం... "మనం ఇప్పుడు ఇరాన్కు జలసంధిపై వాస్తవ నియంత్రణను అప్పగించాము - ఇది ఏ అణ్వాయుధం కన్నా శక్తివంతమైన ఆయుధం" అని అభివర్ణించడం గమనార్హం.

గల్ఫ్ రీజియన్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై లక్షిత దాడులు చేయడం ద్వారా భవిష్యత్ ఘర్షణలలో తన బలాన్ని పెంచుకోవచ్చనే వ్యూహాన్ని ఇరాన్ ఒంటబట్టించుకుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అణు చర్చలకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా అమెరికా, ఇరాన్ దేశాలు వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్లో ఒక అవగాహన ఒప్పందంపై లాంఛనంగా సంతకాలు చేయనున్నాయి.
అయితే, భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తితే ఇరాన్ ఈ జలమార్గాన్ని మళ్లీ ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందనే కోణంలో అమెరికా నిఘా అధికారులు నిరంతరం పునఃసమీక్షిస్తూనే ఉన్నారు. ఇరాన్ జలసంధిని తెరిచి ఉంచి, ఇతర అంతర్జాతీయ కట్టుబాట్లను పాటిస్తేనే ఒప్పందం వల్ల పూర్తి ప్రయోజనాలు పొందుతుందని, ఇరాన్ సాధారణ సముద్ర రవాణాను పునరుద్ధరించిన మేరకే అమెరికా కూడా తన నావికా దిగ్బంధనాన్ని క్రమంగా సడలిస్తుందని ఒక సీనియర్ అమెరికా అధికారి తెలిపారు.
ఈ ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి కారణంగా, జలసంధి గుండా జరిగే వాణిజ్య రవాణా సాధారణ స్థాయికి రావడానికి వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చని షిప్పింగ్ పరిశ్రమ అధికారులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఆందోళనకు ప్రధాన కారణం... ఇరాన్ వద్ద ఇప్పటికీ క్షిపణులు, డ్రోన్లు, క్షిపణి ప్రయోగ వాహనాలతో పాటు వాణిజ్య నౌకలను వేధించగల లేదా మందుపాతరలు వేయగల వందలాది వేగవంతమైన దాడి పడవలు (Fast Attack Craft) సిద్ధంగా ఉన్నాయి.
అంతేకాకుండా, ఇరాన్ తన సైనిక-పారిశ్రామిక స్థావరంలోని కొన్ని భాగాలను ఊహించిన దానికంటే వేగంగా పునర్నిర్మిస్తూ, ఇప్పటికే డ్రోన్ల ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించిందని నివేదిక పేర్కొంది. ఇటీవలి యుద్ధంలో తన సైనిక సామర్థ్యాలను పెద్దగా నష్టపోకుండానే జలసంధిని మూసివేయగలిగినందున, భవిష్యత్తులోనూ ఇరాన్ మళ్లీ ఈ చర్యకు దిగడానికి వెనుకాడకపోవచ్చని నిఘా వర్గాలు అంటున్నాయి.
మరోవైపు, ఎర్ర సముద్రం , హిందూ మహాసముద్రాన్ని కలిపే బాబ్-ఎల్-మండేబ్ జలసంధిని మూసివేయమని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులను ఇరాన్ ప్రోత్సహిస్తోందా అనే కోణాన్ని కూడా అమెరికా అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హోర్ముజ్ , బాబ్-ఎల్-మండేబ్ రెండు జలసంధులకు ఏకకాలంలో అంతరాయాలు ఏర్పడితే ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు, ప్రణాళికాబద్ధమైన అణు చర్చలకు ఆటంకం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఇరాన్ ప్రస్తుతానికి ఆ తీవ్రమైన చర్యకు దూరంగా ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ విస్తృత శాంతి ఒప్పందంపై కొత్తగా అనిశ్చితి తలెత్తింది. సంఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన దక్షిణ లెబనాన్ ప్రాంతాల నుండి వారి బలగాలు పూర్తిగా వైదొలగాలని ఈ ఒప్పందం నిర్దేశిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. బలగాలు వైదొలగనంత వరకు యుద్ధం పూర్తిగా ముగియనట్లేనని ఆయన అన్నారు. అయితే, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తూ, అవసరమైనంత కాలం ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోనే ఉంటుందని ప్రకటించారు.
పాకిస్థాన్, ఖతార్ల మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ముసాయిదా ఒప్పందం ప్రకారం... హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై 60 రోజుల పాటు చర్చలు ప్రారంభించడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. కొన్ని పరిష్కారం కాని అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ... ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ (UK) దేశాల అధినేతలు ఈ ఒప్పందాన్ని ఒక గొప్ప "దౌత్యపరమైన పురోగతి"గా స్వాగతించారు.


Click it and Unblock the Notifications
