వామ్మో..రూ. 30 కోట్లకు అమ్ముడుపోయిన కామెరాన్ గ్రీన్..ఎవరు కొనుగోలు చేశారో తెలిస్తే షాకే..
క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే ఉంది. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబరు 16) జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక వేలంపాటకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. అయితే వేలానికి ముందు, అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేలా బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ టీమిండియా మాజీ స్టార్లతో కలిసి ఒక మాక్ వేలం ను నిర్వహించింది. ఈ మాక్ వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు.
ఈ మాక్ వేలంలో మొత్తం 30 మంది ఆటగాళ్లు వేలానికి వచ్చారు. ఐపీఎల్లోని 10 ఫ్రాంచైజీల తరఫున 10 మంది భారత మాజీ క్రికెటర్లు పాల్గొని, జట్ల తరఫున బిడ్డింగ్ చేశారు. ఇందులో ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహించిన మాజీ వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప తీసుకున్న నిర్ణయాలు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. అతని దూకుడు బిడ్డింగ్ విధానం మాక్ వేలానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఐపీఎల్ మినీ వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అతడు తన పేరును ప్యూర్ బ్యాటర్గా నమోదు చేసుకోవడం కొంత గందరగోళాన్ని సృష్టించింది. ఈ పేస్ ఆల్రౌండర్ బౌలింగ్ చేస్తాడా? కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడా అనే సందేహాలు వెల్లువెత్తాయి. దీనిపై ఇటీవల స్పందించిన గ్రీన్.. తాను పూర్తిస్థాయిలో బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. తన మేనేజర్ చేసిన పొరపాటు వల్లే బ్యాటర్ ఆప్షన్ టిక్ అయ్యిందని చెప్పడంతో ఈ అంశంపై స్పష్టత వచ్చింది.
ఈ నేపథ్యంలో మాక్ వేలంలో గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేశ్ రైనా, కేకేఆర్ తరఫున రాబిన్ ఊతప్ప మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇద్దరూ వెనక్కి తగ్గకుండా బిడ్డింగ్ కొనసాగించడంతో Cameron Green కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు. బిడ్డింగ్ రూ. 27 కోట్లు దాటిన తర్వాత కూడా పోటీ ఆగలేదు. చివరికి ఊతప్ప ఏకంగా రూ. 30.50 కోట్ల భారీ ధరతో గ్రీన్ను కొనుగోలు చేశాడు.
ఇది ఐపీఎల్ చరిత్రలోనే మాక్ వేలంలో నమోదైన అత్యధిక ధరగా నిలిచింది. గత ఏడాది మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానిని మించి గ్రీన్కు మాక్ వేలంలో ధర వచ్చింది. అయితే ఇది మాక్ వేలం అనే సంగతి అభిమానులు గుర్తించుకోవాలి. మాక్ వేలంలో ఊతప్ప తన పర్సులో దాదాపు సగం మొత్తాన్ని గ్రీన్ కోసం వెచ్చించడం గమనార్హం. అంతేకాకుండా అతడు జానీ బెయిర్స్టోను రూ. 2.5 కోట్లకు, అలాగే శ్రీలంక యువ పేసర్, చెన్నై మాజీ బౌలర్ మతీశ పతిరణను రూ. 13 కోట్లకు కొనుగోలు చేయడం మరో ఆకర్షణగా నిలిచింది.
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు) వంటి ఖరీదైన ఆటగాళ్లను వదిలేసింది. ఈ నిర్ణయాలతో కేకేఆర్ పర్సులో రూ. 64.3 కోట్లు చేరాయి. ఇదే అన్ని జట్లలో అత్యధిక మొత్తం. రసెల్ రిటైర్మెంట్తో ఏర్పడిన ఆల్రౌండర్ లోటును భర్తీ చేసే సరైన ఎంపికగా గ్రీన్ను భావించిన ఊతప్ప, ఈ మేరకు భారీ బిడ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేకేఆర్ జట్టులో 13 స్థానాలు ఖాళీగా ఉండటంతో, రాబోయే అసలు వేలంలో కూడా ఈ జట్టు దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని మాక్ వేలం స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. మరి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ వేలంలో ఎంతకు అమ్ముడుపోతాడో చూడాలి.


Click it and Unblock the Notifications


