సెన్సెక్స్ మరో 1000 పాయింట్లు జంప్, 8 సెషన్లలో రూ.19 లక్షలు లాభపడిన ఇన్వెస్టర్లు
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే వార్తలు వస్తే స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి వెళ్తుంది. కానీ నిన్న రాత్రి ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన తర్వాత కూడా మార్కెట్లు దూసుకెళ్లాయి. ఇందుకు ప్రధాన కారణం మొదటి నుండి అభిప్రాయపడినట్లుగా 0.50 శాతం వడ్డీ రేటు పెరగకపోవడం, రెండు వడ్డీ రేటు ఈసారి పెంపు ఖాయమని ఇన్వెస్టర్లకు ముందే తెలియడం. దీంతో ఫెడ్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచినప్పటికీ భారత్ సహా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలకు సానుకూల వాతావరణం నెలకొనడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 2100 పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్ నేడు ఉదయం 57,620 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,095 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,518 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 1047 పాయింట్లు ఎగిసి 57,864 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 311 పాయింట్లు లాభపడి 17,287 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ గత ఎనిమిది సెషన్లలో 5000 పాయింట్ల వరకు లాభపడింది. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 58,000 మార్కును కూడా క్రాస్ చేసింది. అయితే ఆ తర్వాత కాస్త తగ్గింది. మొత్తానికి 53,000 పాయింట్ల దిగువ నుండి 58,000 పాయింట్లకు చేరుకుంది. దీంతో ఈ ఎనిమిది సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.19 లక్షల కోట్లు పెరిగింది.