ఐదు రోజుల్లో రూ.15.74 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఫెడ్ వడ్డీ రేటు పెంపు ప్రకంపనలతో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. సూచీలకు మాంద్యం భయాలు పట్టుకున్నాయి. యూఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. మున్ముందు మరిన్ని వడ్డీ రేట్లు పెంచుతామని సంకేతాలు ఇచ్చింది. జీడీపీ వృద్ధి రేటు అంచనాలను కూడా ఫెడ్ రిజర్వ్ తగ్గించింది. దీంతో ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. మన మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్లు వరుసగా ఐదు రోజులు నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా క్షీణించింది. నిన్న ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.5.54 లక్షల కోట్లు హరించుకుపోయింది. మొత్తంగా ఐదు రోజుల్లో రూ.15.74 లక్షల కోట్లు క్షీణించింది. ఐదు రోజుల్లో సెన్సెక్స్ ఏకంగా 3824.49 పాయింట్లు లేదా 6.91 శాతం పతనమైంది. సెన్సెక్స్ నిన్న 1045 పాయింట్లు లేదా 1.99 శాతం క్షీణించి 51,495 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1574,931 కోట్లు తగ్గి 2,39,20,631 కోట్లకు తగ్గింది.
ఫెడ్ ఒక్కసారి 0.75 శాతం వడ్డీ రేటును పెంచడం 1994 తర్వాత ఇదే మొదటిసారి. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే మరిన్ని రేట్లు పెరగవచ్చు. ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయనే అంచనాలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా పెంచుతోంది. దీంతో మాంధ్యం భయాలు పట్టుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు ఈ నెలలో రూ.31,000 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాదిలో ఎఫ్ఐఐల అమ్మకాలు రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి. ముడి చమురు ధరలు 120 డాలర్లు దాటాయి. ఇది సూచీలపై ప్రభావం చూపిస్తోంది.