గంటకు రూ.1,000 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు, రూ.3.78 లక్షల కోట్లు ఫట్
ముంబై: ప్రపంచ మార్కెట్లో ప్రతికూలతలకు ప్రాఫిట్ బుకింగ్ తోడవడంతో సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 524.96 పాయింట్లు నష్టపోయి 58,490.93 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు క్షీణించి 17,396 వద్ద ముగిశాయి. అమెరికా ఫెడ్ బ్యాంకు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశంతో పాటు గతవారం కేంద్ర కేబినెట్ నిర్ణయాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో ఉంటాయని అంచనా వేసిన వారు కూడా ఉన్నారు. కానీ మార్కెట్లు నష్టాల్లో ఈ వారాన్ని ప్రారంభించాయి. నిన్న మెటల్ షేర్లు భారీగా పతనమయ్యాయి. టాటా స్టీల్, జిందాల్, నాల్కో, సెయిల్ 8 శాతం నుండి 9.5 శాతం వరకు పడిపోయాయి. ఎన్ఎండీసీ, జేఎస్డబ్ల్యు, హిండాల్కో, ఆరు శాతం నుండి ఎనిమిది శాతం, వేదాంత, హిందూస్తాన్ జింక్ మూడు శాతం నుండి ఐదు శాతం మధ్య పడిపోయాయి.
అమ్మకాల ఒత్తిడి..
బ్లూచిప్స్తోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.84 శాతం మేర నష్టపోయాయి. అమ్మకాల వెల్లువెత్తడంతో ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజే రూ.3.49 లక్షల కోట్లు హరించుకుపోయింది. దాంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.255.47 లక్షల కోట్లకు క్షీణించింది. అంటే నిన్న ప్రతి నిమిషానికి ఇన్వెస్టర్లు ప్రతి నిమిషానికి రూ.1000 కోట్లు నష్టపోయారు. టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్...
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 1517599.29 కోట్లు,
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.1414276.81 కోట్లు,
- HDFC బ్యాంకు లిమిటెడ్ రూ.863337.89 కోట్లు,
- ఇన్ఫోసిస్ లిమిటెడ్ రూ.715963.65 కోట్లు
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ రూ.657474.37 కోట్లు
- HDFC రూ.495741.38 కోట్లు
- ICICI బ్యాంకు లిమిటెడ్ రూ.492278.34 కోట్లు
- బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.449249.24 కోట్లు
- భారతీ ఎయిర్టెల్ రూ.398034.68 కోట్లు
- కొటక్ మహీంద్రా బ్యాంకు లిమిటెడ్ రూ.396831.45 కోట్లు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.390273.26 కోట్లు
అంతర్జాతీయ ప్రభావం
అమెరికా, బ్రిటన్, జపాన్ సహా 16 దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ వారంలో భేటీ కానున్నాయి. కరోనా సంక్షోభం నుండి గట్టెక్కేందుకు ప్రకటించిన ఉద్దీపనలను క్రమంగా ఉపసంహరించుకునే అంశంపై ఈ సమావేశాల్లో సంకేతాల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీనికి చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండ్ దివాలా అంచున ఉందనే వార్తలు కలకలం రేపాయి. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పతనమయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంతో రూపాయి క్షీణించడం కూడా ఈక్విటీ ట్రేడింగ్ పైన ప్రభావం చూపింది.
నష్టపోయిన స్టాక్స్
సెన్సెక్స్లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో ఏడు మినహా మిగతా షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్ షేర్ ఏకంగా 9.53 శాతం పతనమైంది. ఎస్బీఐ 3.69 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.5 శాతం క్షీణించగా, HDFC, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ 2 శాతానికి పైగా మార్కెట్ విలువను కోల్పోయింది.