నెల రోజుల్లో 8% పతనం, రూ.14 లక్షల కోట్ల సంపద ఆవిరి: రూపాయి క్షీణత
స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలింది. ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లతో దాదాపు 5000 పాయింట్ల క్షీణతతో ఉంది. నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టం 18,604 పాయింట్లతో దాదాపు 1500 పాయింట్ల క్షీణతతో ఉంది. రెండు సూచీలు కూడా ఆల్ గరిష్టంతో దాదాపు 8 శాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.2.35 సమయానికి సెన్సెక్స్ 1383 పాయింట్లు క్షీణించి 57,411 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 1500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇటీవలి వరకు ప్రాఫిట్ బుకింగ్, ద్రవ్యోల్భణ భయాల కారణంగా సూచీలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. కానీ వివిధ ప్రాంతాల్లో కొత్త వేరియంట్ ఆందోళనతో అంతర్జాతీయ, ఆసియా, భారత మార్కెట్లు నేడు దారుణంగా పతనమయ్యాయి. హెవీ వెయిట్స్ రిలయన్స్ దాదాపు 3 శాతం, హెచ్డీఎప్సీ ద్వయం 2 శాతం కంటే పైన, విప్రో దాదాపు 2 శాతం నష్టపోయాయి. సగానికి పైగా స్టాక్స్ క్షీణించాయి.
రూ.14 లక్షల కోట్లు ఆవిరి
ప్రాఫిట్ బుకింగ్ లేదా ద్రవ్యోల్భణ భయాలు, తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఆందోళన.. ఏదేమైనా దాదాపు నెల రోజులుగా మార్కెట్ లాభాలకు చెక్ పడింది. అప్పుడప్పుడు లాభపడుతున్నప్పటికీ, మళ్లీ వెంటనే పడిపోతున్నాయి. గత నెల రోజులుగా మార్కెట్ కరెక్షన్ బాటలో కనిపిస్తోంది. అక్టోబర్ 19, 2021న సెన్సెక్స్ 62,245 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,604 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మార్కెట్ దాదాపు ఎనిమిది శాతం మేర క్షీణించింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.14 లక్షల కోట్ల వరకు తగ్గింది. ఈ రోజు సూచీలు 2.5 శాతం వరకు పతనమయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 19, 2021 నాటికి రూ.2,74,69,606.93 కోట్లు. నేటి నష్టంతో మార్కెట్ క్యాప్ దాదాపు రూ.2,60,81,433.97 కోట్లకు పడిపోయింది. అంటే ఈ కాలంలో రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది.
ఆసియా నష్టాల్లో
ఈ నెల రోజుల్లో దాదాపు అన్ని రంగాలు క్షీణించాయి. ఇందులో బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ అక్టోబర్ 19వ తేదీ నాటి నుండి 13.6 శాతం పతనమైంది. బీఎస్ఈ ఎనర్జీ ఇండెక్స్ 10 శాతానికి పైగా, బీఎస్ఈ బ్యాంకెక్స్ 8.2 శాతం, ఫైనాన్స్ 7.37 శాతం, ఎఫ్ఎంసీజీ 7.04 శాతం, బీఎస్ఈ ఐటీ 6.68 శాతం, బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ 6.1 శాతం, బీఎస్ఈ ఆటో 6.01 శాతం, బీఎస్ఈ రియాల్టీ 5.74 శాతం నష్టపోయాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 5.65 శాతం, 4.6 శాతం క్షీణించాయి.
నేడు ఆసియా మార్కెట్లు 1.5 శాతం నుండి 2.5 శాతం మేర క్షీణించాయి. జపాన్ నిక్కీ 2.5 శాతం, స్ట్రేయిట్ టైమ్స్ 1.77 శాతం, హాంగ్షెంగ్ 2.67 శాతం, తైవాన్ వెయిటెడ్ 1.61 శాతం, కోస్పి 1.47 శాతం, సెట్ కాంపోజిట్ 2.24 శాతం, జకర్తా కాంపోజిట్ 2.06 శాతం, షాంఘై కాంపోజిట్ 0.56 శాతం నష్టపోయాయి. యూరోపియన్, ఆసియా మార్కెట్లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయి. డౌజోన్స్ 0.026 శాతం నష్టపోగా, నాస్డాక్ 0.44 శాతం లాభాల్లో ఉంది.
నష్టాలకు కారణాలు
సౌతాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొత్త కరోనా పట్ల అప్రమత్తమై, దీని నియంత్రణపై చర్చించనుంది. ఇటీవలి వరకు ప్రాఫిట్ బుకింగ్, ఆ తర్వాత ద్రవ్యోల్భణ భయాలకు కొత్త వేరియంట్ తోడై అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు అన్ని కూడా నష్టాల్లోనే ఉన్నాయి.
అమెరికా నేతృత్వంలోని చమురు వినియోగ దేశాలు క్రూడ్ నిల్వలను విడుదల చేస్తుండటంతో ప్రపంచ సరఫరా మిగులు పెరుగుతుందనే ఆందోళనతో చమురు ధరలు శుక్రవారం 1 శాతానికి పైగా క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ 81.26 శాతానికి, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 77.04 శాతానికి తగ్గింది.
కరోనా కొత్త వేరియంట్ కారణంగా పలు దేశాల్లో లాక్ డౌన్ ఉంటుందనే ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్లొవేకియా రెండు వారాల లాక్ డౌన్ ప్రకటించింది.చెక్ రిపబ్లిక్ ఆంక్షలు విధించింది. జర్మనీలో కరోనా మృతులు 1 లక్ష దాటాయి.
ఫారెన్ పోర్ట్పోలియో ఇన్వెస్టర్స్(FPIs) విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ మార్కెట్ సెంటిమెంటును బలహీనపరిచాయి.
రూపాయి మూడువారాల కనిష్టానికి పడిపోయింది. రూ.74.58 వద్ద కనిష్టాన్ని తాకింది. నవంబర్ 2వ తేదీ తర్వాత ఇదే కనిష్టం.