Policybazaar: పాలసీబజార్ వాటాలను అమ్మేస్తున్న సాఫ్ట్ బ్యాంక్..! ఈరోజే బ్లాక్ డీల్..
Policybazaar: గత కొన్ని వారాలుగా పెద్ద ఇన్వెస్టర్లు స్టార్టప్ కంపెనీల్లోని తమ వాటాలను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. బ్లాక్ డీల్స్ రూపంలో తమకు ఉన్న వాటాలను విక్రయిస్తున్నాయి. అయితే ఈ సారి పాలసీబజార్ వంతు వచ్చినట్లు ప్రముఖ బిజినెస్ వార్త సంస్థలు కథనాన్ని ప్రచురించాయి.
తాజా వివరాల ప్రకారం డిసెంబర్ 2న బ్లాక్ డీల్ రూపంలో సాఫ్ట్బ్యాంక్ తన వాటాలను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్బ్యాంక్ కు పాలసీబజార్ లో 10 శాతం వాటను కలిగి ఉంది. ఈ క్రమంలో ఫిన్టెక్ కంపెనీలో తన వాటాలను సగానికి తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్ బ్యాంక్ విక్రయిస్తున్న వాటాల విలువ దాదాపు రూ.1,000 కోట్లు ఉంటుందని సమాచారం.
బ్లాక్ డీల్ లో ఒక్కోషేరును రూ.440 బేస్ ధరకు విక్రయించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఉదయం 10.27 గంటల సమయంలో పీబీ ఫిన్ టెక్ లిమిటెడ్ స్టాక్ ఎన్ఎస్ఈలో 2.30 శాతం పెరిగి రూ.471.65 వద్ద ట్రేడ్ అవుతోంది. సిటీ బ్యాంక్ ఈ డీల్కు ఏకైక బ్రోకరేజ్ గా ఉన్నట్లు సమాచారాం.
ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పాలసీబజార్లో సాఫ్ట్బ్యాంక్ సంస్థ సుమారు 199 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. సెప్టెంబర్ 2022తో ముగిసిన రెండవ త్రైమాసికంలో పాలసీబజార్ రూ.186.63 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నష్టం రూ.204.44 కోట్లుగా ఉంది. పాలసీబజార్ గత ఏడాది నవంబర్లో పీబీ ఫిన్టెక్ కంపెనీ పేరుతో స్టాక్ మార్కెట్లోకి ఐపీవోగా వచ్చింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,274 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.356.20 వద్ద ఉంది.