అమెరికా-ఇరాన్ ఒప్పందానికి 60 రోజుల రోడ్మ్యాప్.. స్విస్ చర్చల్లో కీలక ముందడుగు
స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన మొదటి విడత సాంకేతిక దౌత్య చర్చలకు సంబంధించిన తాజా పరిణామాలను ప్రసిద్ధ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ చర్చలు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో, వాషింగ్టన్ - టెహ్రాన్ మధ్య గత వారం కుదిరిన 14-అంశాల అవగాహన ఒప్పందంలో భాగంగా జరుగుతున్నాయి. ఈ అవగాహన ఒప్పందం తదుపరి చర్చల కోసం 60 రోజుల కాలపరిమితిని కల్పించింది.
అమెరికా దౌత్యవేత్తను ఉటంకిస్తూ ఆక్సియోస్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ చర్చలు రోజంతా వివిధ రూపాల్లో సాగాయి. ఈ మొదటి విడత చర్చలలో ప్రధానంగా లెబనాన్ సంక్షోభం, హోర్ముజ్ జలసంధి , సాధ్యపడే అణు ఒప్పందం వంటి కీలక అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల నేపథ్యంలో, అక్కడ కాల్పుల విరమణను అమలు చేయడం, సంఘర్షణ నివారణకు అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.

అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలమార్గాన్ని మూసివేస్తామంటూ ఇటీవల ఇరాన్ చేసిన ప్రకటనలు ఆందోళన రేకెత్తించినప్పటికీ, ఈ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచేలా చూసే విషయంలో తాము మంచి పురోగతి సాధించామని అమెరికా దౌత్యవేత్త స్పష్టం చేశారు. వీటితో పాటు ఇరు దేశాల మధ్య సాధ్యపడే అణు ఒప్పందంలోని అన్ని ముఖ్యాంశాలను కూడా ఈ భేటీలో ప్రస్తావించారు. 14-సూత్రాల ఒప్పందం అమలుపై అందరూ ఒకే అవగాహనకు రావడానికి ఈ చర్చలు ఉపయోగపడ్డాయని దౌత్యవేత్త తెలిపారు.
పశ్చిమ ఆసియా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం స్విట్జర్లాండ్లో ఇరాన్ ఉన్నతాధికారులతో నేరుగా సమావేశమయ్యారు. పాకిస్తాన్ , ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో సాగుతున్న ఈ ఉన్నత స్థాయి చర్చలలో, టెహ్రాన్తో సంబంధాలను మూలభూతంగా మార్చడానికి వాషింగ్టన్ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని వాన్స్ అందించారు. అలాగే దౌత్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేశాన్ని కూడా ఆయన ఇరాన్ వర్గాలకు తెలియజేశారు.
ఈ చర్చలు ఆరంభంలో కొంత సంక్లిష్టతను ఎదుర్కొన్నాయి. ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, ప్రతినిధి బృందాలు అంతర్గత సంప్రదింపులు జరిపేందుకు వీలుగా, మొదటి విడత చర్చలను ప్రారంభమైన 80 నిమిషాలకే తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం ట్రంప్ చేసిన కొన్ని బెదిరింపుల కారణంగా చర్చల వాతావరణం మరింత జటిలంగా మారిందని సీఎన్ఎన్ పేర్కొంది. అధికారిక చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ, ఇరు పక్షాలను తిరిగి చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి దౌత్యపరమైన రహస్య ప్రయత్నాలు తెరవెనుక నిరంతరం కొనసాగుతున్నాయని ఇరాన్ వర్గాలు తెలిపాయి.
తొలి విడత చర్చల సరళిపై అమెరికా దౌత్యవేత్త ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ చర్చలు భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికి గట్టి పునాది వేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సీనియర్ రాజకీయ నాయకత్వంతో జరిగే చర్చలు సోమవారంతో ముగియనున్నప్పటికీ, సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సాంకేతిక బృందాలు స్విట్జర్లాండ్లోనే మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications
