Infosys: ఒకేసారి రెండు కంపెనీల్లో పని వద్దు.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హెచ్చరిక.. కంపెనీల కొత్త ప్లాన్స్..
Infosys: కరోనా తర్వాత పగలు ఒకటి, రాత్రి ఒకటి చొప్పున రెండు ఉద్యోగాలు చేయటం ప్రారంభించారు టెక్కీలు. అయితే ఇది కంపెనీలకు చాలా ప్రమాదకరంగా మారింది. ఈ పద్ధతి మానుకోవాలని ఐటీ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చాయి. ఈ వ్యవహారంలో ఒక్కో కంపెనీ తీరు ఒక్కోలా ఉంది. అయితే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపటం ఆందోళన కలిగిస్తోంది.
ఇన్ఫోసిస్ వార్నింగ్..
కొన్ని వారాల క్రితం రెండు చోట్ల పని చేయడంపై ఇన్ఫోసిస్ తీవ్రంగా స్పందించింది. ఇలా చేయటం స్పష్టమైన స్కామ్ అని యాజమాన్యం అభిప్రాయపడింది. ఆ సందర్భంలో.. తమ ఉద్యోగులకు ప్రవర్తనా నియమావళి ప్రకారం మూన్లైట్ అనే రెండు ఉద్యోగాలు చేయడానికి అనుమతించబడదని ఇన్ఫోసిస్ తేల్చి చెప్పింది.
తాజా హెచ్చరిక..
ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపిన తాజా ఈ-మెయిల్లో.. రెండు పని గంటలు, డబుల్ లైఫ్, మూన్లైటింగ్ లేవని హెచ్చరించింది. కంపెనీలో షిఫ్ట్ ముగిసిన తర్వాత బయట కంపెనీలకు సంబంధించిన ఎలాంటి అసైన్ మెంట్స్ లేదా ప్లాజెక్టుల కోసం పనిచేయటం అనుమతించబడదని కంపెనీ స్పష్టం చేసింది. గతంలో విప్రో మూన్లైటింగ్ను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన తర్వాత తాజాగా ఇన్ఫోసిస్ తాజాగా ఈ ప్రకటన చేసింది. ఇంట్లో ఇతర కంపెనీలకు పని చేయవద్దని హెచ్చరించింది.
ఆఫీసులకు రావాలంటూ..
రెండు ఉద్యోగాల విషయంలో గొడవ సద్దుమణిగిన తర్వాత చాలా కంపెనీలు ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించగా.. చాలా మంది రావడానికి ఇష్టపడలేదు. ఫ్రీలాన్సింగ్ వంటి వాటి నుంచి తమకు ఎక్కువ ఆదాయం వస్తున్నందున కొందరు రాజీనామా చేయడం కూడా ప్రారంభించారు. దీంతో ఐటీ కంపెనీల నుంచి వెళ్లిపోతున్న ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల రెండు ఆదాయలు పొందుతున్న అనేక మంది ఆఫీసులకు రావటం కుదరదంటున్నారు. వారంలో రెండు రోజులు ఆఫీసుకు రావటం మిగిలిన రోజులు ఇంటి నుంచి పనిచేయటం వంటి హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
మూన్లైటింగ్కు సపోర్ట్..
దేశంలో అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ తమ ఉద్యోగులను మూన్లైటింగ్కు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. అయితే దీనివల్ల కంపెనీ ఉత్పత్తి ప్రభావితం కాకుండా చూసుకోవాలని షరతు పెట్టింది. ఇదే క్రమంలో.. ఆన్లైన్ ఆర్థిక సేవల సంస్థ Cred కూడా దాని కార్పొరేట్ ఉద్యోగులకు రెండు ఉద్యోగాలు చేయడానికి అనుమతిస్తోంది.
ఐటీ కంపెనీలు ఏమి చేయవచ్చంటే..
కంపెనీలు ఉమ్మడిగా మూన్ లైటింగ్ నిరోధించేందుకు మెల్లగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఐటీ నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ఈ రంగంలోని కంపెనీలు కలిసి పనిచేయవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా కంపెనీలు సమస్య నివారణకు ఇప్పుడు ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి. పైగా నియామక సమయంలోనే కార్యాలయానికి వచ్చి పనిచేయాలని.. వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం లేదని తేల్చి చెబుతున్నాయి. దీనికి తోడు ఇతర దేశాల్లోని ఉద్యోగుల నియామకాలు చేసుకుంటూ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.