Infosys News: భారత ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ వరుసగా ఎదురుదెబ్బలు చవిచూస్తోంది. ఆరునెలల కాలంలోనే ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు కంపెనీని వీడటం ఇన్వెస్టర్లను కొంత కలవరానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం కంపెనీలో చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్(CISO)గా ఉన్న విశాల్ సాల్వి ఇన్ఫోసిస్ను వీడారు. ఆయన సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్హీల్ కి నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు తాజా నిర్ణయం తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాల్వి విస్తృతమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. ఇన్ఫోసిస్, PwC, HDFC బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్, క్రాంప్టన్ గ్రీవ్స్ వంటి ప్రఖ్యాత సంస్థల్లో కీలక పాత్రల్లో పనిచేశారు.

సైబర్ సెక్యూరిటీ రంగంలో 29 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం కలిగిన సాల్వి ఇన్ఫోసిస్ కంపెనీలో దాదాపు 7 సంవత్సరాలు పనిచేశారు. సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా ఉన్న క్విక్ హీల్ సీఈవోగా విశాల్ బాధ్యతలు చేపట్టం కంపెనీకి కలిసొచ్చే అంశంగా ఉంది. నిరంతరం పెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ భద్రత ప్రాధాన్యతలు ఈ రంగంలో వ్యాపారాన్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలో సైబర్ భద్రతను అందరికీ ప్రాథమిక హక్కుగా మార్చే భాగస్వామ్య లక్ష్యానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు విశాల్ సాల్వి తన నియామకం తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు.
సాల్వి బాధ్యతలు స్వీకరించిన క్విక్ హీల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ వ్యవస్థాపకుడు, అవుట్గోయింగ్ CEO కైలాష్ కట్కర్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా మారతారు. కస్టమర్ సెంట్రిసిటీ, ఇన్నోవేషన్ తమను ముందుకు నడుపుతుందని ఆయన తెలిపారు. భారతదేశంలోని సైబర్ సెక్యూరిటీ పర్యావరణ వ్యవస్థను మార్చడంతో పాటు ప్రపంచ పటంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీ నుంచి ఉన్నతాధికారి స్థాయి వ్యక్తులు రాజీనామాలు చేయటం కొనసాగుతున్నాయి. 2023 ప్రారంభంలో ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి.. టెక్ మహీంద్రా సీఈవోగా చేరడానికి కంపెనీని వీడారు. దీనికి ముందు ప్రెసిడెంట్ రవికుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా చేరారు. అలాగే సుదీప్ సింగ్ ఇన్ఫోటెక్ సీఈవోగా చేరడానికి వైదొలిగారు.


Click it and Unblock the Notifications