Infosys: విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీసు సిద్ధం.. కార్యకలాపాలు ప్రారంభం ఎప్పుడంటే..
Infosys: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన తన నివాసాన్ని ఉక్కునగరానికి మార్చనున్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తున్న తరుణంలో దేశంలోని ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ తన కొత్త కార్యాలయాన్ని సాగర నగరంలో తెరవటం కలిసొచ్చే అంశంగా నిలుస్తోంది.

విశాఖ కార్యాలయం..
ఇన్ఫోసిస్ తన విశాఖ కార్యాలయం ప్రారంభం గురించి ప్రకటించింది. మే 31, 2023 నుంచి తన కార్యకలాపాలను ఉక్కు నగరంలో ప్రారంభిస్తుందని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అధికారికంగా వెల్లడించింది. కార్యాలయ స్థలాన్ని ఖరారు చేయటంలో జాప్యం వల్లనే ఆలస్యం జరిగినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. రుషికొండ సమీపంలోని ఐటీ సెజ్లో క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే వైజాగ్ సెజ్లోని సిగ్నేచర్ టవర్స్లో 650 సీటింగ్ కెపాసిటీ ఆఫీసును అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

కొత్త క్యాంపస్లో..
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని ఉద్యోగులను తమ కొత్త క్యాంపస్లో ఉంచడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని యాజమాన్యం పేర్కొంది. వైజాగ్తో పాటు, కోయంబత్తూర్, నోయిడా, కోల్కతా, హుబ్లీ, ముంబైలలో ఇదే రోజున ఇన్ఫోసిస్ కొత్త శాఖలను ప్రారంభించనుందని తెలుస్తోంది. కరోనా తర్వాత ఉద్యోగులకు అనువుగా టైర్-2,3 నగరాల్లో చిన్న కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఐటీ దిగ్గజం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఏపీ IT మంత్రి..
రానున్న కాలంలో విశాఖ నగరం మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఏపీ పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి 100 మందిలో 15 మంది తెలుగువారు ఉన్నారని మంత్రి తెలిపారు. వీరిలోనూ 10 మంది టెక్కీలు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారేనని పేర్కొన్నారు. గడచిన మూడున్నరేళ్లలో రాష్ట్రం రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications