కరోనా: ఐటీ కంపెనీలకు ఇదో పెద్ద అనుభవం, మార్చి నాటికి 20% వర్క్ ఫ్రమ్ హోమ్
హైదరాబాద్: కరోనాను మించిన అతిపెద్ద బిజినెస్ ఛాలెంజ్ను ఎప్పుడు ఎదుర్కోలేదని ఇన్పోసిస్ సీఈవో ప్రవీణ్ రావు అన్నారు. టెక్నాలజీపరంగా, సామాజికంగాను ఈ మహమ్మారి చాలా మార్పులు తీసుకు వచ్చిందన్నారు. హైసియా ఇన్నోవేషన్ సమ్మిట్ 2020లో ఆయన మాట్లాడారు. ఐటీ కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో తీసుకున్న చర్యలు, అనుసరించిన మార్పులు కొనసాగుతాయని, మళ్లీ పాత పద్ధతులకు వెళ్లడం ఉండకపోవచ్చునన్నారు. కరోనా నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులనైనా తట్టుకునే వ్యాపార సంస్థలు ఉండాలన్నారు.
తెలంగాణ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి! AWSపై కేటీఆర్ కీలక ప్రకటన
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూకుడు
గత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో దేశ సగటు కంటే రెండింతలు వృద్ధి నమోదు చేసింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆఫీస్ స్పేస్ వినియోగంలో ఆరేళ్లలోనే ఆరోస్థానం నుండి రెండో స్థానానికి చేరుకుంది. నైట్ ఫ్రాంక్ వంటి సంస్థ కార్యాలయాల ఏర్పాటు హైదరాబాద్ వృద్ధి వేగవంతానికి నిదర్శనం. కరోనా క్లిష్ట పరిస్థితుల నుంచి ఐటీ పరిశ్రమ వేగంగా కోలుకుందని, ప్రయివేటు రంగంలో ఉద్యోగాల తొలగింపు సహజమే అయినప్పటికీ పెద్ద మొత్తంలో ఎక్కడా జరగలేదని కేటీఆర్ తెలిపారు.
ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు హైసియా, ఇతర ఐటీ పరిశ్రమల సంస్థలతో చర్చించి లే-ఆఫ్ రిడ్రెసల్ కమిటీని ఏర్పాటు చేశారు.
మార్చి నాటికి 20% వర్క్ ఫ్రమ్ హోం
హైదరాబాదులోని ఐటీ కంపెనీలకు సమీప భవిష్యత్తులో డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ గొప్ప వ్యాపార అవకాశం కానుందని హైసియా ఓ నివేదికలో తెలిపింది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఐటీ రంగం సన్నద్ధమవుతోందని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ఆటోమోటివ్ రంగం నుండి డిజిటల్ సొల్యూషన్లకు డిమాండ్ కనిపిస్తోంది. కరోనా ప్రభావం నుండి హైదరాబాద్ ఐటీ రంగం కోలుకొని సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీల్లో 90 శాతం వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. అయితే వచ్చే మార్చి నాటికి ఇది తగ్గుతుందని తెలిపింది. అప్పటికి 20 శాతం మంది ఇంటి నుండి పని చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, టీసీఎస్లకు అవార్డులు
పలు విభాగాల్లో వృద్ధి కనబర్చిన కంపెనీలకు కేటీఆర్ హైసియా పురస్కారాలు అందించారు. టాప్ ఐటీ ఎక్స్పోర్టర్ విభాగంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎంఎన్సీ కేటగిరీలో డెలాయిట్, కాగ్నిజెంట్ అవార్డులు అందుకున్నాయి. రూ.1000 కోట్ల ఎగుమతుల విభాగంలో సెయెంట్, హెచ్సీఎల్, రూ.500 కోట్ల ఎగుమతులు విభాగంలో డీబీఎస్ ఏషియా హబ్ 2కు అవార్డులు వచ్చాయి.