Infosys Q3 results: డిజిటల్ బూస్ట్, ఇన్ఫోసిస్ ప్రాఫిట్ 12% జంప్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన 11.8 శాతం పెరిగి రూ.5,197 కోట్ల నుండి రూ.5,809 కోట్లకు పెరిగింది. కంపెనీకి ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 22.91 శాతం పెరిగి రూ.25,927 కోట్ల నుండి రూ.31,867 కోట్లకు పెరిగింది. FY22లో ఈ కంపెనీ రెవెన్యూ గైడెన్స్ను 19.5 శాతం నుండి 20 శాతానికి పెంచింది.
సాధారణంగా డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి కాస్త బలహీనంగా ఉంటుంది. కానీ ఈ కంపెనీ వరుసగా మంచి వృద్ధిని, ఫలితాలను నమోదు చేస్తోంది. మూడో త్రైమాసికంలో పెద్ద డీల్స్ వచ్చాయి. 2.53 బిలియన్ డాలర్ల టోటల్ కాంట్రాక్ట్ వ్యాల్యూ(TCV) డీల్స్ వచ్చాయి. ఆపరేటింగ్ మార్జిన్స్ 23.5 శాతం నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన 1.9 శాతం, త్రైమాసికం ప్రాతిపదికన 0.1 శాతం తగ్గాయి. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ బాగా కలిసి వచ్చింది.
అయితే ఇన్ఫోసిస్ అధిక ఆట్రిషన్ను ఎదుర్కొంటోంది. ఇది డిసెంబర్ త్రైమాసికంలోను కొనసాగింది. వాలంటరీ ఆట్రిషన్ రేటు ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 20.1 శాతంగా ఉండగా, ఇప్పుడు 25.5 శాతానికి పెరిగింది. ఇన్ఫోసిస్ షేర్లు నేడు 1.09 శాతం లాభపడి రూ.1875.80 వద్ద ముగిశాయి.