ఇన్ఫోసిస్ అదుర్స్, క్వార్టర్ 3లో రూ.4,466 కోట్ల నికర లాభం, ఆదాయంలో పెరుగుదల
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూడో క్వార్టర్ నెట్ ప్రాఫిట్ 23.7 శాతం ఎగసి రూ.4,466 కోట్లకు చేరుకుంది. 2019-20 ఆదాయం అంచనా 10 నుంచి 10.5 శాతంగా ఉంటుందని అంచనా. ఇన్ఫోసిస్ మూడో క్వార్టర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అంచనాలను మించి ఫలితాలు సాధించింది.
ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2019-20, Q3) సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,466 కోట్లకు చేరుకుంది. 2018-19 సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ. 3,610 కోట్లు. దీంతో పోలిస్తే 23.7 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయం ఈ Q3లో 7.9 శాతం వృద్ధితో రూ.23,092 కోట్లకు చేరింది.
గత ఏడాది Q3లో ఆదాయం రూ.21,400 కోట్లుగా నమోదయింది. ప్రధానంగా డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడటం, అన్ని వ్యాపార విభాగాల్లోనూ స్థిరమైన వృద్ధి సాధించటం వల్ల కంపెనీ మెరుగైన పనితీరు ప్రదర్శించింది. మార్కెట్ విశ్లేషకులు Q3లో ఇన్ఫోసిస్ రూ. 4,206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా.
భారీ ఆదాయం నేపథ్యంలో కంపెనీ పనితీరు మెరుగైన నేపథ్యంలో ఆదాయ అంచనాలను కూడాా సవరించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయ అంచనాను గతంలో పేర్కొన్న 9-10 శాతం నుంచి 10-10.5 శాతానికి పెంచింది. గతంలో 21-23 శాతంగా అంచనా వేసిన నిర్వహణ మార్జిన్ రేటును మాత్రం యథాతథంగా కొనసాగించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన 3 త్రైమాసికాలకు (ఏప్రిల్-డిసెంబర్) గాను ఇన్ఫోసిస్ నిర్వహణ లాభం వార్షిక ప్రాతిపదికన 0.6% పెరిగి 204.9 కోట్ల డాలర్లకు చేరుకుంది. నిర్వహణ మార్జిన్ 21.4% నమోదయింది. ఆదాయం 9.7% వృద్ధితో 958.3 కోట్ల డాలర్లకు చేరుకుంది.
డాలర్ రూపంలో కంపెనీ నికర లాభం 24.8% పెరిగి 627 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆదాయం 8.6% అందుకొని 3.24 బిలియన్ డాలర్లకు ఎగిసింది. డిసెంబర్ చివరినాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,43,454కు చేరుకుంది. గడిచిన క్వార్టర్లో నికరంగా 6,968 మందిని రిక్రూట్ చేసుకుంది. ఉద్యోగుల వలసలు 19.6% ఉన్నాయి.
బ్రెగ్జిట్ నేపథ్యంలో యూరప్లో బ్యాంకింగ్, రిటైల్ రంగాల్లో నెలకొన్న మందగమనం భారీ వృద్ధికి అడ్డంకిగా మారాయి. ఉత్తర అమెరికా మాత్రం వృద్ధిని నమోదు చేసుకుంది. సమీక్షకాలంలో కంపెనీ 5,064 కోట్ల ఆపరేటింగ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.4,830 కోట్లతో పోలిస్తే 4.8% పెరుగుదల కనిపించింది. ఆపరేటింగ్ మార్జిన్లు 20 బేసిస్ పాయింట్లు పెరిగి 21.9% చేరుకుంది. కంపెనీ షేర్ ధర 1.47% పెరిగి రూ.738.25 వద్దకు చేరుకుంది.
ఇదిలా ఉండగా, ఇన్ఫోసిస్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నట్లు అమెరికాకు చెందిన విజిల్ బ్లోయర్ ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి ఏర్పాటు చేసిన ఆడిట్ కమిటీకి ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ పేర్కొంది. సంస్థ అంతర్గత విచారణలో భాగంగా ఏర్పాటు చేసిన ఆడిట్ కమిటీ గత 3 నెలలుగా విచారించిందని, ఎలాంటి ఆధారాలు కనిపించలేదని ఇన్ఫీ ఆడిట్ కమిటీ చైర్పర్సన్ సుందరం పేర్కొన్నారు.