ఆ విషయంలో తప్పుచేశానంటూ Infosys నారాయణ మూర్తి పశ్చాత్తాపం.. అసలేమైంది..?
Infosys: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థల్లో ఒకటి ఇన్ఫోసిస్. దీనిని విజయవంతంగా ఈ స్థాయికి తీసుకురావటంతో నారాయణ మూర్తి పాత్ర చాలా కీలకమైనదని చెప్పుకోవాలి. కొంత మంది మిత్రులతో కలిసి కేవలం రూ.10,000 పెట్టుబడితో సహవ్యవస్థాపకుడిగా మారారు.
IT దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం కాటమరాన్ వెంచర్స్ ఛైర్మన్ అయిన NR నారాయణ మూర్తి.. వారాంతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ లో విద్యార్థులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన తన జీవిత విశేషాలను పంచుకున్నారు. తన తల్లి విషయంలో తాను చేసిన పొరపాటును గుర్తు చేసుకుని పశ్చాత్తాపడ్డారు.

తన తల్లి చనిపోయే సమయంలో మాత్రమే ఇన్ఫోసిస్ని సందర్శించమని ఆహ్వానించినందుకు బాధ పడ్డారు. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమెను ఆహ్వానించి ఉండాల్సిందని.. అలా చేయలేకపోయినందుకు బాధగా ఉందని మూర్తి అన్నారు. జీవితంలో కార్పొరేట్ నాయకుడి ప్రేరణ ఎలా ఉండాలనే దాని గురించి కూడా మాట్లాడారు.
నిర్ణయం తీసుకునేటప్పుడు దానివల్ల నష్టపోయే పేద ప్రజల గురించి ఆలోచించాలని మూర్తి విద్యార్థులకు సూచించారు. తాను ఈ విషయాన్ని మహాత్మా గాంధీ నుంచి నేర్చుకున్నానని తెలిపారు. సంపదను పంచుకోవడం శక్తివంతమైన ప్రేరణ సాధనంగా ఎలా పని చేస్తుందో కూడా మూర్తి హైలైట్ చేశారు. తాను జీతంలో 1/10 వంతు మాత్రమే తీసుకునేవాడినని.. జూనియర్ సహోద్యోగులకు 20 శాతం అదనంగా ఇచ్చేవాడిననని మూర్తి తెలిపారు. ఇలా చేయటం వల్ల జట్టులో బాధ్యతాయుత భావనను కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
కాలేజీలో ఆ తర్వాత పనిచేసిన పరిశ్రమలోనూ తన కంటే తెలివైన వ్యక్తులు చాలా మంది ఉన్నారని మూర్తి తెలిపారు. అయితే తన వినయం కెరీర్లో ఎదగడానికి సహాయపడిందని చెప్పారు. ఎంత ఎదిగినా పాదాలను నేలపైనే ఉంచాలని తనను తాను ఉదాహరణగా విద్యార్థులకు తెలిపారు. ఉన్నత స్థాయి కార్యనిర్వాహకుడికి అత్యంత కావాల్సిన లక్షణాల్లో Humility ఒకటని మూర్తి అన్నారు.
విద్యార్థులు మంచి నాయకులుగా మారడానికి అధ్యాపకులను సంప్రదించాలని మూర్తి సూచించారు. అలాగే మెరుగైన కంపెనీని నిర్మించడంలో ఫ్యాకల్టీ సభ్యులు కూడా CEOలకు సహాయం చేయగలరని నారాయణమూర్తి చెప్పారు.


Click it and Unblock the Notifications