IT news: 2001లో గడ్డు పరిస్థితిని గుర్తు చేసుకున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. ఎవరూ చేయని పనిచేసినట్లు వెల్లడి
IT news: IT కంపెనీలు తీవ్ర ఆర్థిక నిశ్చితిని ఎదుర్కొంటున్న సమయంలో, దేశీయ సంస్థలు మాత్రం కొంత ఫర్వాలేదనిపించాయి. కానీ ప్రెషర్లను అక్కున చేర్చుకునే విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఒకానొక దశలో ఈ పంచాయితీ కేంద్రమంత్రి వద్దకు సైతం వెళ్లింది. మెల్లమెల్లగా మాంద్యం పరిస్థితులు చక్కబడుతూ ఉండటంతో.. ఇప్పుడు నియామకాల వైపు టెక్ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రెషర్ల కోసం ఇన్ఫోసిస్ గతంలో తీసుకున్న చర్యలు గురించి సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి వెల్లడించారు.
ఆఫర్ ఇస్తే చాలు తగ్గేదే లే..
2001 సమయంలో ఇన్ఫోసిస్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితిని నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు. అప్పటికే 1,500 ఫ్రెషర్లకు ఆఫర్ల జారీచేశామన్నారు. వాటిని రివోక్ చేయకుండా గౌరవించామని తెలిపారు. ఏ ఒక్కరినీ వదులుకోకుండా కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ల వేతనాల్లో పెద్ద ఎత్తున కోత విధించనున్నట్లు.. నాస్కామ్ టెక్నాలజీ మరియు లీడర్ షిప్ ఫోరంలో వెల్లడించారు. ఈ విషయంపై సంబంధిత సిబ్బందితో మాట్లాడినట్లు, అందరూ కలిసి అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. అలా చేసిన ఏకైక సంస్థ తమదేనని, అందుకు తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.
భారత టెక్ సంస్థలు భయపడాల్సిన పనిలేదు:
"భవిష్యత్తులో మాంద్యం ముంచుకురానున్నట్లు వస్తున్న వార్తలపై నేను ఆందోళన చెందడం లేదు. దేశీయ కంపెనీలు ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అమెరికాలో తిరోగమన పరిస్థితి ఉన్నప్పుడు.. తమ వ్యయంలో కోత విధించుకుంటూ, మెరుగైన సేవలు పొందడంపై వారు దృష్టి పెడతారు. అలా చూస్తే భారతీయ టెక్ సంస్థలు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన సేవలు అందించడంలో ముందున్నాయి. కాబట్టి ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియన్ కంపెనీలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు
ఈ సమయంలో ఆ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత:
తీవ్ర ఒడిదుడుకుల మధ్య IT కంపెనీలు ఆన్ బోర్డింగ్ ను వాయిదా వేస్తూ వస్తున్నాయి. గతంలో ప్రెషర్లకు రిలీజ్ చేసిన ఆఫర్ లెటర్లలోని వేతనాల్లో దాదాపు 46 శాతం కోత విధింపులకు అంగీకరిస్తే త్వరగా ఆన్ బోర్డ్ చేస్తామని విప్రో పేర్కొన్నట్లు సైతం వార్తలు వచ్చాయి. పలు టెక్ కంపెనీల CEOలు, ప్రెషర్ల మధ్య వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు వివిధ మీడియా సంస్థలు నివేదించాయి. ఈ సమయంలో ఇన్ఫోసిస్ సారథి చేసిన కామెంట్స్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.