మార్చి 11న యూకే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు
యూకే ప్రభుతవం మార్చి 11వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్ను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి ఛాన్స్లర్ రిషి సునక్ ప్రవేశ పెడుతున్నారు. తమ ప్రభుత్వం ప్రకటించినట్లుగా మార్చి పదకొండున బడ్జెట్ ప్రవేశ పెడతామని ఆయన మంగళవారం వెల్లడించారు. జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా కన్సర్వేటివ్ పార్టీ తరఫున ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చే దిశలో ఈ బడ్జెట్ ఉంటుందన్నారు.
పెరగనున్న వేతనాలు.. చైనా కంటే ఎక్కువ, ఎంత శాతమంటే? ఈ రంగంలో 'డబుల్'!
ఆర్థికమంత్రి సజిద్ జావిద్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ట్రెజరీ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న 39 ఏళ్ల రిషి సునక్ను ఇటీవల కేబినెట్లోకి తీసుకున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఆయన కొత్తగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో బడ్జెట్ ఆలస్యం కావొచ్చుననే వాదనలు వినిపించాయి.
అయితే, గతంలో ప్రకటించిన షెడ్యూల్ (మార్చి 11) ప్రకారమే బడ్జెట్ను ప్రవేశ పెడతామని రిషి సునక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని తమ కన్సర్వేటివ్ పార్టీ గెలిచిన అనంతరం ఎన్నికలకు ముందు ఓటర్లకు ఇచ్చిన హామీలతో తాను బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.
మొదటి బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నామని, ఇది బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు చేయడంతో పాటు దేశ సమతౌల్యతకు అద్దం పట్టేలా ఉంటుందని పేర్కొన్నారు.
భారత సంతతికి చెందిన 39 ఏళ్ల రుషి సునక్ ఇంగ్లాండులోని హాంపషైర్ కౌంటీలో జన్మించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్షైర్లోని రిచ్మండ్ నుండి ఎంపీగా గెలిచారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయినా నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లాడారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.