Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంబరాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కీలక నిర్ణయం..!
Infosys: మూన్లైటింగ్ విషయం సంచలనంగా మారిన తర్వాత చాలా కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమలులోకి తెస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వారానికి కనీసం 3 రోజులు ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. ఈ తరుణంలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చేసిన ప్రకటన వారి ఉద్యోగుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా త్రైమాసిక ఫలితాలు అంత ఆశాజనకంగా లేని సమయంలో ఈ ప్రకటన రావటం గమనార్హం.
ఫలితాలు..
ఇన్ఫోసిస్ నిన్న తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతంలో ఉద్యోగులను మూన్ లైటింగ్ వివాదం విషయంలో విప్రో 300 మందిని తొలగించిన విషయం మనందరికీ తెలిసిందే. విప్రోను ఫాలో అవుతూ తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ కూడా గత కొన్ని నెలలుగా రెండు ఉద్యోగాలు ఏకకాలంలో నిర్వహిస్తున్న ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. గడచిన 12 నెలల కాలంలో ఇలాంటి ఉద్యోగులను తొలగించినట్లు సీఈవో సలీల్ పారిఖ్ వెల్లడించారు.
అట్రిషన్ రేటు ఇలా..
ప్రస్తుతం ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల టర్నోవర్ రేటు 28.4 శాతం నుంచి 27.1 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో విప్రో 23 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 23.8 శాతం, టీసీఎస్ 21.5 శాతం అట్రిషన్ రేటు ఉన్నాయి. టాప్ నాలుగు టెక్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ అధిక అట్రిషన్ రేటును కలిగి ఉంది.
ఉద్యోగులకు వెసులుబాటు..
మూన్లైటింగ్, అట్రిషన్ రేటు మధ్యలో చిక్కుకున్న ఇన్ఫోసిస్.. తన ఉద్యోగులకు కొంత వెసులుబాటును అందిస్తోంది. మార్కెట్లోని ఇతర ఐటీ దిగ్గజాల మాదిరిగా ఉద్యోగులందరినీ ఆఫీసులకు రావాలని ఒత్తిడి చేయటం లేదని సీఈవో సలీల్ పారిఖ్ వెల్లడించారు. ఉద్యోగులకు ఈ విషయంలో కంఫర్ట్ కొనసాగిస్తామని సలీల్ వెల్లడించారు. కావాలనుకున్నప్పుడు ఆఫీసుకు, మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి పనిచేయవచ్చంటూ Infosys తన ఉద్యోగులకు జాక్పాట్ అందించింది.
ఆఫీసుల నుంచి..
ప్రస్తుతం కంపెనీ దేశ వ్యాప్తంగా ఉన్న అనేక కార్యాలయాల్లో ప్రతిరోజూ 45,000 మందికి పైగా ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారు. ఇంతకు ముందు ఈ సంఖ్య మరింత తక్కువగా ఉండేది. అందరికీ ఉపయోగపడేలా వ్యవస్థను తీసుకొస్తున్నట్లు సీఈవో తెలిపారు. ఇందులో భాగంగా కంపెనీ ఇప్పటికే అనేక టైర్2,3 నగరాల్లో కార్యాలయాలను ప్రారంభిస్తోంది. అలా తాజాగా ఏపీలోని విశాఖలో కంపెనీ కార్యాలయాన్ని తెరిచింది.
నియామకాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మందిని నియమించుకోవాలని ఇన్ఫోసిస్ భావించింది. అయితే మొదటి ఆరు నెలల్లో 40,000 మందిని నియమించుకుంది. అయితే కంపెనీలో అట్రిషన్ రేటును తగ్గించేందుకు కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్పల్పంగా ఉద్యోగుల టర్నోవర్ తగ్గటానికి కారణంగా నిలుస్తోంది.