200 మంది ఉద్యోగులు, వారి కుటుంబాల్ని అమెరికా నుండి తీసుకొచ్చిన ఇన్ఫోసిస్
అమెరికాలో చిక్కుకుపోయిన 200 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రత్యేక చార్టర్డ్ విమానంలో స్వదేశానికి తీసుకు వచ్చింది. ఇందులో వీసా గడువు ముగిసిన వారు కొంతమంది ఉన్నారు. కరోనా మహమ్మారి, షట్ డౌన్ కారణంగా వీరంతా అమెరికాలో చిక్కుకుపోయారు. వారి ఇబ్బందుల నేపథ్యంలో స్పందించిన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులను వెనక్కి తీసుకు వచ్చి భారీ ఉపశమనం కల్పించింది.
కరోనా దెబ్బతో కుప్పకూలిన ఆ దేశ ఎకానమీ, శాలరీ లేక 20 రాత్రులు వీధుల్లోనే
కరోనా కారణంగా చిక్కుకుపోయారు
సాఫ్టువేర్ ఎక్స్పోర్టర్ ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఈ ఉద్యోగులను శాన్ఫ్రాన్సిస్కో నుండి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో వారిని తీసుకు వచ్చింది. ఈ విమానం సోమవారం ఉదయం బెంగళూరుకు చేరుకుంది. కరోనా మహమ్మారి మన జీవితాలను చాలా ప్రభావితం చేసిందని, అమెరికాలో కొంతమంది తమ ఉద్యోగులు వీసా గడువు ముగియడంతో అక్కడే చిక్కుకున్నారని, మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీంతో వారిని తీసుకు వచ్చినట్లు ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ బోడే తన లింక్డిన్ పేజీలో రాసుకున్నారు.
మార్చి నుండి అమెరికాలో చిక్కుకుపోయారు
విదేశంలో చిక్కుకుపోయిన తమ ఉద్యోగుల కోసం ఇన్ఫోసిస్ 200 మంది ఉద్యోగులు, అక్కడే ఉన్న కుటుంబాల కోసం విమానాన్ని బుక్ చేసింది. దీంతో చాలా రోజులుగా అనిశ్చితిలో కూరుకుపోయిన ఆ ఉద్యోగులు బెంగళూరులో విమానం ల్యాండ్ కావడంతో ఊపిరి తీసుకున్నారు. ఈ అంశంపై ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది. కరోనా కారణంగా వీసా గడువు ముగిసిన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా తదితర కంపెనీల ఉద్యోగులు మార్చి నుండి అమెరికాలో చిక్కుకుపోయారు.
అమెరికా అతిపెద్ద మార్కెట్
ఇన్ఫోసిస్కు అమెరికా అతిపెద్ద మార్కెట్. మార్చి నాటికి ఈ టెక్ దిగ్గజం ఆదాయంలో అమెరికా వాటా 61.6 శాతం. కంపెనీ స్థానిక ఉద్యోగులను ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ, హెచ్1బీ వీసాలపై ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. గత 24 నెలల కాలంలో ఇన్ఫోసిస్ స్థానికీకరణలో భాగంగా 10వేల మందికి పైగా అమెరికా పౌరులు లేదా అమెరికా శాశ్వత పౌరులకు ఉద్యోగం కల్పించింది. కాగా, మహమ్మారి కారణంగా వ్యాపారాలు మందగించాయి. దీంతో ప్రాజెక్టులు వాయిదా పడిన లేదా రద్దు చేయబడిన ఉద్యోగులు ఇంటికి పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువమంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేశారు.