ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: బోనస్ కోత, జీతాల పెంపుపై సస్పెన్స్!
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. జూన్ త్రైమాసికానికి సంబంధించిన బోనస్ను ప్రకటించింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి బోనస్లో 10 శాతం కోత విధించడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
సాధారణంగా, ఐటీ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని వేరియబుల్ పే లేదా బోనస్గా ఇస్తారు. దీన్ని నాలుగు త్రైమాసికాలుగా విభజించి, ఉద్యోగి పనితీరు ఆధారంగా ప్రతి క్వార్టర్లో చెల్లిస్తుంటారు.

ఈ క్రమంలోనే జూన్ త్రైమాసికానికి బోనస్ ప్రకటించగా, ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత కొన్ని త్రైమాసికాలుగా ఐటీ సేవల సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే బోనస్లు, జీతాల పెంపు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
తాజా ప్రకటన ప్రకారం, జూన్ త్రైమాసికానికి సగటు బోనస్ చెల్లింపు 70 శాతంగా ఉంది. ఇది మార్చి త్రైమాసికంతో సమానమే అయినప్పటికీ, గతేడాది జూన్ త్రైమాసికంలో ఇచ్చిన 80 శాతం బోనస్తో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ.
ఇన్ఫోసిస్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ త్రైమాసికంలో 65 నుంచి 80 శాతం మధ్య బోనస్ చెల్లించారు. కంపెనీలో ఉద్యోగులను పలు స్థాయిలుగా (బ్యాండ్స్గా) విభజించారు. వీరిలో JL6 స్థాయి ఉద్యోగులతో పోలిస్తే JL4, JL5 స్థాయి ఉద్యోగులకు ఎక్కువ బోనస్ అందినట్లు స్పష్టమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే, JL4 బ్యాండ్లోని ఉద్యోగులకు గరిష్టంగా 80 శాతం, JL5 బ్యాండ్లోని వారికి 78 శాతం వరకు బోనస్ ఇచ్చారు. ఇన్ఫోసిస్లో మొత్తం 3,28,062 మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో ఎక్కువ మంది JL4, JL5, JL6 బ్యాండ్లలోనే పనిచేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు ఖర్చులను తగ్గించుకోవడం, ఆర్థిక మందగమనం, ఏఐ (AI) టెక్నాలజీ రాకతో వ్యాపారంలో వస్తున్న మార్పులు వంటి కారణాలు భారత ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఈ ప్రభావం కారణంగానే ఇన్ఫోసిస్ ఇప్పుడు బోనస్లో భారీగా కోత విధించింది. బోనస్ తక్కువగా రావడంతో నిరాశ చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఇప్పుడు మరో పెద్ద ఆందోళన మొదలైంది. అదే వార్షిక జీతాల పెంపు (Annual Salary Hike).
కరోనా మహమ్మారి సమయం నుంచి ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాల పెంపును అందించడం లేదు. ప్రతీసారి ఆలస్యం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో, అసలు ఈ ఏడాది జీతాల పెంపు ఎప్పుడు ఉంటుందనే ప్రశ్న ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది.
తాజాగా కంపెనీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది జీతాల పెంపు రెండు దశల్లో ఉంటుందని తెలుస్తోంది. రాబోయే 2 నెలల్లో JL4, JL5 స్థాయి ఉద్యోగులకు, ఆ తర్వాత 2027 జనవరిలో JL6 స్థాయి ఉద్యోగులకు పెంపు వర్తింపజేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications