IT News: IT రంగంలో భారత్ దూకుడు.. రెండో అతిపెద్ద IT సంస్థగా ఇండియన్ కంపెనీ
IT News: భారతీయ IT సెక్టార్ కు ప్రపంచంలో మంచి పేరు ఉంది. అంతర్జాతీయ సంస్థలతో దేశీయ కంపెనీలు పోటీపడుతుండటం శుభపరిణామం. IT సేవల విభాగంలో TCS రారాజుగా వెలుగొందుతుండగా.. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ రెండవ, బెంగళూరు కంపెనీ ఇన్ఫోసిస్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి. 2012లో రెండో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్.. రానున్న మార్చి నాటికి తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకుంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
వ్యాపారంలో మందగింపు:
గత అక్టోబరు-డిసెంబర్ కాలంలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ఆదాయం క్రమంగా పడిపోయింది. ప్రస్తుత జనవరి-మార్చి మధ్య వ్యాపారం మరింత మందగిస్తుందని ఆ సంస్థ అంచనా వేసింది. మొదటి త్రైమాసకంలో 4.71-4.76 బిలియన్ డాలర్ల మధ్య రాబడి ఉంటుందని భావిస్తోంది. తద్వారా బెంగళూరు చెందిన ఇన్ఫోసిస్.. కాగ్నిజెంట్ ను వెనక్కి నెట్టి రెండవ అతిపెద్ద స్వదేశీ IT సేవల సంస్థగా అవతరించనుంది.
బ్లూమ్ బర్గ్ పోల్ ఏమి చెప్తోంది?
ఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే.. అక్టోబర్-డిసెంబర్ మధ్య 4.66 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఇన్ఫోసిస్ నమోదు చేసింది. మార్చి 2023తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16-16.5 శాతం వృద్ధి ఆశిస్తున్నట్లు అంచనా వేసింది. మార్చి 2023తో ముగియనున్న చివరి త్రైమాసికానికిగాను 4.78 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తుందని.. 18 మంది విశ్లేషకులతో కూడిన బ్లూమ్ బర్గ్ పోల్ నివేదించింది. అదే సమయంలో.. కాగ్నిజెంట్ రాబడి 4.76 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేసింది.
దశాబ్ధం తర్వాత..
2012 ఏప్రిల్-జూన్ మధ్య ఇన్ఫోసిస్ ను వెనక్కి నెట్టి.. TCS తర్వాత రెండవ అతిపెద్ద IT కంపెనీ స్థానాన్ని కాగ్నిజెంట్ ఆక్రమించింది. అయితే దశాబ్దం తర్వాత అంటే మార్చి 2023లోపు కాగ్నిజెంట్ ను అధిగమించి ఇన్ఫోసిస్ రెండో స్థానాన్ని దక్కించుకుంటుందని గతేడాది జనవరిలోనే ఓ ప్రముఖ మీడియా సంస్థ అంచనా వేసింది. కాగా ఇప్పుడు ఇది నిజం కానుంది.
నాయకత్వ మార్పు:
ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ చేపట్టిన మార్పులు సత్ఫలితాలనిచ్చాయని నిపుణులు భావిస్తున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ హంఫ్రీస్ను గత నెలలో తొలగించిన కాగ్నిజెంట్.. రవి కుమార్ను ఆయన స్థానంలో నియమించుకుంది. ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి అయిన రవికుమార్ ఇప్పుడు కాగ్నిజెంట్ పగ్గాలు చేపట్టగా.. కంపెనీని వృద్ధి బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని పెద్ద డీల్స్ సాధించే విధంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.