ఇన్ఫోసిస్, బ్యాంకింగ్ అదరగొట్టాయి, మార్కెట్ క్యాప్ రూ.274 లక్షల కోట్లకు
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం( జనవరి 10, 2022) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు నేడు రోజంతా అదే జోరును కొనసాగించాయి. గత ఏడాది నవంబర్ 17వ తేదీ తర్వాత నిఫ్టీ మొదటిసారి 18,000 మార్కును క్రాస్ చేసింది. వడ్డీరేటు పెంపు ఆందోళనల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు వాల్ స్ట్రీట్ నష్టపోయింది. ఆసియా మార్కెట్ల పైన ఈ ప్రభావం పడి, మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. అయితే భారత సూచీలు మాత్రం పరుగులు తీశాయి. ఇక డాలర్ మారకంతో రూపాయి మరో 18 పైసలు లాభపడి 74.16 వద్ద ముగిసింది. నేడు ఉదయం ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్లో 74.15 వద్ద ప్రారంభమైంది.
ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ అదుర్స్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు సోమవారం 3 శాతం మేర ఎగబాకింది. అయితే ఆ తర్వాత తగ్గినప్పటికీ దాదాపు ఒక శాతం లాభంతో ముగిసింది. రూ.30 పెరిగి రూ.3,884 వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో ఈ స్టాక్ 3,979 వద్ద ట్రేడ్ అయింది. మరో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ స్టాక్ రెండు శాతం కంటే పైగా లాభపడి రూ.1852 వద్ద ముగిసింది. విప్రో షేర్ 0.89 శాతం లాభపడి రూ.1719 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ పరుగులు తీశాయి. ఇన్ఫోసిస్, బ్యాంకింగ్ స్టాక్స్ సహా పలు హెవీ వెయిట్స్ లాభపడటంతో సెన్సెక్స్ 651 పాయింట్లు ఎగిసింది. అయితే విప్రో, హెచ్సీఎల్ టెక్ స్టాక్స్ నష్టపోయాయి. కొటక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, HDFC, యాక్సిస్ 1 శాతం నుండి 2 శాతం మేర లాభపడగా, ఇండస్ఇండ్ బ్యాంకు స్వల్పంగా నష్టపోయింది. భారత అతిపెద్ద కంపెనీ రిలయన్స్ నేడు స్వల్పంగా నష్టపోయింది. ఫెడరల్ బ్యాంకు స్టాక్ 4 శాతం, టైటాన్ స్టాక్ 3 శాతం లాభపడ్డాయి.
భారీ లాభాల్లో ముగింపు
సెన్సెక్స్ నేడు ఉదయం 60,070.39 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,427.36 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,987.18 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,913.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,017.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,879.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 650.98 (1.09%) పాయింట్లు లాభపడి 60,395.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 190.60 (1.07%) పాయింట్లు ఎగిసి 18,003.30 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్, టైటాన్ కంపెనీ, హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, దివిస్ ల్యాబ్స్, నెస్ట్లే, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి.
మార్కెట్ క్యాప్
నేడు మార్కెట్ భారీ ర్యాలీ నేపథ్యంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.274.73 లక్షల కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 18వ తేదీన ఈ మార్కెట్ క్యాప్ 274.70 లక్షల కోట్లు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. నేడు ఈ మార్కు దాటింది. ఈ కాలంలో సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 7.6 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచటీ 7.5 శాతం, బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 11.71 శాతం, బీఎస్ఈ 500 7.6 శాతం ఎగిశాయి.