Infosys: ఇటీవల ప్రముఖ టెక్ కంపెనీ TCS కొన్ని సంస్థలను కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు మరో దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఓ కంపెనీని సొంతం చేసుకోనుంది. 2024లో తన మొదటి టేకోవర్ను బాంబే స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ప్రకటించింది.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సెమీకండక్టర్ డిజైన్ మరియు ఎంబెడెడ్ సేవలను అందించే ఇన్సెమీని ఇన్ఫోసిస్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 280 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఎక్స్ఛేంజ్లో ఫైలింగ్లో పేర్కొంది. 153.6 కోట్ల ఆదాయ సామర్థ్యం కలిగిన ఈ కంపెనీ కొనుగోలు.. 2024 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ముగుస్తుందని వెల్లడించింది.

'డీల్ ముగింపు నాటికి సర్దుబాట్లతో కలిపి నిర్వహణ, ప్రోత్సాహకాలు మరియు రిటెన్షన్ బోనస్ సహా మొత్తం 280 కోట్ల మేర ఖర్చు అవుతుంది' అని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇన్సెమీలో ప్రస్తుతం 900 మంది ఉద్యోగులు ఉన్నారు. 2013లో స్థాపించబడిన ఇన్సెమీ.. ఎలక్ట్రానిక్ డిజైన్, ప్లాట్ఫారమ్ డిజైన్, ఆటోమేషన్, ఎంబెడెడ్ మరియు సాఫ్ట్వేర్ టెక్నాలజీలలో నైపుణ్యంతో ఎండ్-టు-ఎండ్ సెమీకండక్టర్ డిజైన్ సేవలను అందిస్తోంది.
'ఈ వ్యూహాత్మక పెట్టుబడి ఇన్ఫోసిస్ ఇంజనీరింగ్, R&D సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని నావిగేట్ చేయడంలో గ్లోబల్ క్లయింట్లకు సహాయపడటానికి తన నిరంతర నిబద్ధతను ప్రదర్శిస్తుంది' అని కంపెనీ EVP దినేష్ ఆర్ తెలిపారు.
'గత 5 సంవత్సరాల్లో సెమీకండక్టర్ విభాగంలో ఇన్సెమీ పటిష్టమైన వృద్ధి మరియు డిజైన్ సామర్థ్యాలతో పునాదిని నిర్మించింది. తద్వారా తదుపరి తరం సాంకేతికతను గ్లోబల్ క్లయింట్లతో పాటు పరిశ్రమ రంగాల్లో విస్తరించే అవకాశం లభిస్తుంది. మా పురోగతిని మరింత వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మా బృందాలకు కొత్త అవకాశాలను తెరిచే ఆవిష్కరణల మార్గాన్ని సుగమం చేస్తుంది' అని సహ వ్యవస్థాపకులు శ్రీకాంత్ సంపిగేతయ మరియు అరుప్ డాష్ అన్నారు.


Click it and Unblock the Notifications