Inflation: దేశాభివృద్ధిలో ఆర్థిక రంగం పాత్ర అత్యంత కీలకం. దానిని ముందుండి నడిపించే ఇంధనంగా ద్రవ్యోల్బణాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా మొత్తం ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయి అన్నమాట. దాదాపు గత ఏడాదిన్నర నుంచి అధిక ద్రవ్యోల్బణంతో ఇండియా ఇబ్బంది పడుతోంది. RBI గరిష్ఠ లక్ష్యాన్ని సైతం దాటి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అయితే ఎట్టకేలకు NSO దీనిపై శుభవార్త చెప్పింది.
కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ద్రవ్యోల్బణం మార్చిలో 15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) వెల్లడించింది. అంతకు ముందు ఏడాదిలో 6.95 శాతం, ఫిబ్రవరిలో 6.44 శాతం ఉండగా.. గత నెలలో 5.66 శాతానికి క్షీణించినట్లు పేర్కొంది. అంటే మార్చి ముందు వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గరిష్ఠ బెంచ్ మార్క్ 6 శాతాన్ని మించి భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.

కూరగాయల రేట్లు తగ్గుముఖం పట్టడంతో ఆహార ధరల ద్రవ్యోల్బణం 4.79 శాతా నికి పరిమితమైంది. గత 6 దఫాలుగా కీలకమైన రెపో రేటును పెంచుకుంటూ పోయిన సెంట్రల్ బ్యాంక్.. CPIలో ఏర్పడిన ఈ మార్పు వల్ల ఈసారి మార్పు చేయలేదు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి 2022 నుంచి తీసుకుంటున్న చర్యలు ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తూ.. ప్రస్తుతం సత్ఫలితాలనిస్తున్నాయి.
వృద్ధికి ఊతం ఇవ్వడం కోసం మందగిస్తున్న ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించుకోవాలని RBI భావిస్తోంది. అందుకు అనుగుణంగా భవిష్యత్తులో పాలసీ రేటును మరింత తగ్గించే అవకాశాలు లేకపోలేదు. వీటికి తోడు 2023లో రుతుపవనాలు సాధారణ స్థాయలో ఉంటాయని భారత వాతావరణ శాఖ మంగళవారం విడుదల చేసిన అంచనాలు సైతం శుభసూచకమే. తద్వారా జూన్ లో ప్రారంభం కానున్న వ్యవసాయ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.


Click it and Unblock the Notifications