RBI అకౌంట్ అగ్రిగేటర్: దేశంలోనే తొలి బ్యాంకు ఇండస్ఇండ్, ప్రయోజనాలివే...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ కింద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్(FIP) సేవల్ని అందిస్తోన్న మొట్టమొదటి బ్యాంకుగా ఇండస్ఇండ్ బ్యాంకు నిలిచింది. డిజిసాహామతితో ముందుకు వచ్చింది. దేశంలోనే FIP ఈ సేవలను అందిస్తున్న తొలి బ్యాంకు తమదేనని బ్యాంకు గురువారం ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఇప్పుడు వారి ఖాతాల స్టేట్మెంట్లు, ట్రాక్ డిపాజిట్లు, ప్లాన్ ఇన్వెస్ట్మెంట్స్ (షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సురెన్స్, ఈపీఎఫ్, పీపీఎఫ్), క్రెడిట్ కార్డులు పొందటం వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చును. తద్వారా కస్టమర్లు తమ ఆర్థిక అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సింగిల్ విండో విధానం ఉపయోగపడుతుంది.
రెమిటెన్స్, జన్ధన్, ఉద్యోగాల డేటా: భారత్లో రికవరీ ఉందా?: సర్వేలో కీలక విషయాలు
ఇది కీలకమైన అడుగు
ఆర్బీఐ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల వ్యక్తులతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులు సేవలను పొందవచ్చు. ఇది వారి ఆర్థిక అవసరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేందుకు సహకరిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంకు ఎప్పుడు కూడా కస్టమర్ సాధికారత కోసం సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలపై దృష్టి సారించిందని ఇండస్ఇండ్ బ్యాంక్(కన్స్యూమర్ బ్యాంకింగ్ హెడ్) సౌమిత్ర సేన్ తెలిపారు. ఇందులో భాగంగా అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ కీలకమైన అడుగు అన్నారు. వివిధ బ్యాంకులు సహా ఇతర మార్గాల ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన ఉత్పత్తి, సేవలను ఎంచుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.ఈ ప్రయాణంలో డిజిసాహామతి ఫౌండేషన్తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
అకౌంట్ అగ్రిగేటింగ్ ఫ్రేమ్వర్క్ను ఇండస్ఇండ్ బ్యాంకు స్వీకరించడంలో ఆశ్చర్యం లేదని, ఈ రంగంలో విభిన్నమైన, వినూత్నమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు రావడానికి అవకాశాలు ఉన్నాయని డిజిసాహామతి సహవ్యవస్థాపకులు బిజి మహేష్ అన్నారు.
అకౌంట్ అగ్రిగేటర్ సిస్టం అందించే ప్రయోజనాలు
అకౌంట్ అగ్రిగేటర్ సిస్టం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత ఫిజికల్ డాక్యుమెంట్ సబ్మిషన్ ప్రక్రియను తొలగిస్తుంది. దీనికి ఎంతో సమయం పోతోంది. ఈ పద్ధతి ద్వారా సమయం వృధా కాదు.వ్యక్తులు, ఎస్ఎంఈ కస్టమర్లు తమ ఆర్థిక సమాచారాన్ని డిజిటల్గా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ వంటి నియంత్రిత ఆర్థిక సంస్థలతో సురక్షిత చట్రంలో పంచుకోవచ్చు.సమాచారాన్ని పంచుకోవడానికి ముందు స్పష్టమైన సమ్మతి ద్వారా పంచుకున్న ఆర్థిక సమాచారంపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేందుకు కస్టమర్కు అనుమతిస్తుంది.
ఇండస్ఇండ్ బ్యాంకు
ఇండస్ఇండ్ బ్యాంకు 1994లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2020 జూన్ 30వ తేదీ నాటికి ఇండస్ఇండ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 1911 బ్రాంచీలు, బ్యాంకింగ్ ఔట్లెట్స్ ఉన్నాయి. 751 ప్రాంతాల్లో 2,721 ఏటీఎంలు ఉన్నాయి. కాగా, ఇండస్ ఇండ్ బ్యాంకును కొటక్ మహీంద్ర బ్యాంకు అక్వైర్ చేసుకోనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ వార్తలను ఇండస్ఇండ్ బ్యాంకు కొట్టిపారేసింది. ఇప్పుడు బ్యాంకు కస్టమర్లు తమ ఆర్థిక సమాచారాన్ని అకౌంట్ అగ్రిగేటర్ ఎకోసిస్టం ద్వారా ఆర్థిక సమాచారాన్ని పంచుకోవడంలో సహకరించే పద్ధతిని తీసుకు వచ్చింది.