లాక్ డౌన్ సమయంలో విమానాల రద్దు చెల్లింపులు చేస్తున్న ఇండిగో .. ఇప్పటివరకు రూ .1,030 కోట్ల చెల్లింపులు
బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఇండిగో పీకల్లోతు నష్టాల్లో ఉన్నప్పటికీకరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో విమానాలు రద్దు చేయబడిన వినియోగదారులకు రావాల్సిన మొత్తాలను వేగంగా తిరిగి చెల్లిస్తున్నట్లుగా విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. 2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విమాన సేవలను పూర్తిగా నిలిపివేసినందున వారు తమ వినియోగదారులకు చెల్లించాల్సిన మొత్తంలో 99.95% వాపసు ఇచ్చినట్లు ఇండిగో ప్రకటించింది.
మూడో త్రైమాసికంలో కూడా నష్టాల బాటలో .. విమానయాన సంస్థ ఇండిగో
1,030 కోట్లకు తిరిగి వాపసులను ప్రాసెస్ చేసిందని చెప్పిన ఇండిగో ఎయిర్లైన్స్ ప్రతినిధి
గత సంవత్సరం మహమ్మారి ప్రేరిత లాక్డౌన్ కారణంగా ప్రయాణించలేని ప్రయాణీకులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పూర్తి నగదు వాపసు ఇవ్వవలసి ఉంది . ఈ నేపథ్యంలో మార్కెట్ వాటా ప్రకారం దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ, ఎయిర్లైన్స్ ఇప్పటికే 1,030 కోట్లకు తిరిగి వాపసులను ప్రాసెస్ చేసిందని చెప్పారు. ఇది మొత్తం వినియోగదారులకు చెల్లించాల్సిన మొత్తంలో 99.95%. పెండింగ్లో ఉన్న క్రెడిట్ షెల్లు ఎక్కువగా నగదు లావాదేవీలని , ఇందులో ఇండిగో వినియోగదారుల నుండి బ్యాంక్ బదిలీ వివరాల కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు.
లాక్ డౌన్ వల్ల ఆదాయం ప్రభావితం .. వాపసులు వెంటనే చెల్లించలేకపోయాం : ఇండిగో సిఈఓ
ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనోజోయ్ దత్తా మాట్లాడుతూ, కోవిడ్ -19 ఆకస్మికంగా ప్రారంభమవడం, దాని ఫలితంగా లాక్ డౌన్ విధించడం, 2020 మార్చి చివరి నాటికి మా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది అన్నారు. టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన నగదు ప్రవాహం ప్రభావితం కావడంతో, మేము రద్దు చేయబడిన విమానాల కోసం వాపసులను వెంటనే ప్రాసెస్ చేయలేకపోయామని వెల్లడించారు . అంతేకాకుండా మా కస్టమర్ల వల్ల తిరిగి చెల్లించే క్రెడిట్ షెల్లను సృష్టించాల్సి వచ్చిందని చెప్పారు .
తాము 99.95% క్రెడిట్ షెల్ చెల్లింపులను పంపిణీ చేశామన్న ఇండిగో
టిక్కెట్టు నగదును తిరిగి ఎయిర్ లైన్స్ ఇచ్చిన కాలంలో ఎప్పుడైనా వినియోగించుకోగలగటమే క్రెడిట్ షెల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఏదేమైనా, కార్యకలాపాలు పునఃప్రారంభం కావడంతో, విమాన ప్రయాణానికి డిమాండ్ నిరంతరం పెరగడంతో, క్రెడిట్ షెల్ మొత్తాలను వేగవంతమైన రీతిలో తిరిగి ఇవ్వడం మా ప్రాధాన్యతగా భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు తాము 99.95% క్రెడిట్ షెల్ చెల్లింపులను పంపిణీ చేశామని మరియు కస్టమర్ల నుండి అవసరమైన వివరాలను స్వీకరించిన వెంటనే మిగిలిన చెల్లింపులను పూర్తి చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.
విమానయాన చెల్లింపుల విషయంలో పరిస్థితి మెరుగు పడిందన్న ముంబై గ్రాహక్ పంచాయతీ చైర్మన్
ఇక ఇదే సమయంలో ముంబైకి చెందిన వినియోగదారుల సంస్థ ముంబై గ్రాహక్ పంచాయతీ చైర్మన్ న్యాయవాది శిరీష్ దేశ్పాండే మాట్లాడుతూ విమానయాన సంస్థలపై ఫిర్యాదుల సంఖ్య తగ్గడంతో పరిస్థితి మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు . వాపసులకు సంబంధించి అనూహ్యంగా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. గత ఎనిమిది రోజులలో మాకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. అయితే, సుప్రీంకోర్టు కోరిన వడ్డీ మొత్తాన్ని విమానయాన సంస్థలు చెల్లిస్తున్నాయో లేదో చూడాల్సి ఉందని వినియోగదారుల సంస్థ చైర్మన్ దేశ్పాండే వెల్లడించారు.