ఆ కస్టమర్లకు ఇండిగో గుడ్న్యూస్, జనవరి 31 నాటికి రీఫండ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మార్చి నుండి లాక్ డౌన్ కాలంలో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. విమాన సర్వీసులు రద్దయిన కాలానికి సంబంధించి కస్టమర్ల క్రెడిట్ షెల్స్ను తిరిగి చెల్లిస్తామని, వీటిని జనవరి 31, 2021 నాటికి అందిస్తామని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సోమవారం ప్రకటించింది. ఇప్పటికే రూ.1,000 కోట్ల వరకు కస్టమర్లకు రీఫండ్ చేసినట్లు తెలిపింది. తద్వారా కస్టమర్లకు చెందిన దాదాపు 90 శాతం మొత్తాన్ని రీఫండ్ చేశామని తెలిపింది.
HDFC బ్యాంకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేయండి, షాకిచ్చిన ఆర్బీఐ, ఎందుకంటే
ఆదాయం లేకపోవడంతో...
ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనోజాయ్ దత్తా మాట్లాడుతూ... కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో విమానయాన కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. కార్యకలాపాలు లేకపోవడంతో తమ ఆదాయం పూర్తిగా లేకుండా పోయిందని, అందుకే రద్దైన విమాన సర్వీసులకు సంబంధించి వెంటనే రీఫండ్ చేయలేకపోయామన్నారు. తమ కస్టమర్ల కోసం క్రెడిట్ షెల్స్ తెచ్చామన్నారు.
వాటిని చెల్లిస్తాం
ఏదేమయినప్పటికీ కార్యకలాపాల పునఃప్రారంభమైనందున, అలాగే విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, క్రెడిట్ షెల్ మొత్తాన్ని త్వరితగతిన చెల్లించడమే తమ ముందున్న తొలి ప్రాధాన్యత అని రోనోదత్తా అన్నారు. జనవరి 31, 2021 నాటికి వంద శాతం క్రెడిట్ షెల్ చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుండి విమాన కార్యకలాపాలు 100 శాతానికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయ కార్యకలాపాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.
కరోనా.. లాక్ డౌన్
కరోనా నేపథ్యంలో రెండు నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. మే 25వ తేదీన దేశీయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మార్చి 23 నుండి అంతర్జాతీయ విమానాలు నిలిపివేశారు. మే నెల నుండి వందే భారత్ మిషన్, కింద, జూలై నుండి ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు విమానసంస్థలకు కేంద్రం అనుమతిచ్చింది.