1000 పాయింట్లు నష్టపోయి, కోలుకున్న సెన్సెక్స్: వీఐఎల్ సూచీ 22% పైనే
స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 25, 2022 మంగళవారం) కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఓ సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అయినప్పటికీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 57,158.63 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,626.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,409.63 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,001.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,201.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,836.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
వెయ్యి పాయింట్లకు పైగా పతనమై...
నేడు ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఉదయం వెయ్యి పాయింట్లకు పైగా పతనమై 56,500 పాయింట్ల దిగువకు కూడా పడిపోయింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లు. ఈ గరిష్టంతో దాదాపు ఏడువేలు పతనమైంది. అయితే తిరిగి కోలుకొని, 57,000 పైన ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా ఓ సమయంలో 16,900 పాయింట్ల దిగువకు పడిపోయి, అనంతరం 17,140 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మధ్యాహ్నం గం.1.15 సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 57,386 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8.50 పాయింట్లు క్షీణించి 17,140 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది
టాప్ గెయినర్స్, లూజర్స్
బ్యాంకింగ్, పవర్ సూచీలు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ 0.5 శాతం వరకు నష్టపోయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.3 శాతం లాభపడింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంకు, యూపీఎల్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, విప్రో, టైటాన్ కంపెనీ, రిలయన్స్, HDFC బ్యాంకు ఉన్నాయి.
వీఐఎక్స్
మార్కెట్ ఒడిదుడుకులను సూచించే వొలాటాలిటీ ఇండెక్స్ (VIX) 22.62 శాతానికి చేరుకుంది. సాధారణంగా వీఐఎక్స్ పెరుగుదల ఇన్వెస్టర్ల అనిశ్చితి, భవిష్యత్తు భయాలను సూచిస్తుంది. రాబోయే నెల రోజుల్లో మార్కెట్ కదలికలపై ఓ అంచనా అందిస్తుంది. వీఐఎక్స్ పదిహేను శాతానికి పైగా ఉంటే రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్లో భారీ ఊగిసలాట కొనసాగే అవకాశముంది. మార్కెట్ కదలికలపై ఇన్వెస్టర్ల భయాలను తెలియజేస్తుంది. రిలయన్స్ షేర్లు నేడు 1.5 శాతం నష్టపోయింది.