ఐదు రోజుల నష్టాల అనంతరం.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు
ముంబై: వరుసగా ఐదు రోజుల పాటు భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 23, మంగళవారం) లాభాల్లోకి వచ్చాయి. నిన్న ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ముగియడంతో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడి, సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకు పైగా నష్టపోయింది. కేవలం ఐదు సెషన్లలో 2400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ నేడు ప్రారంభ సెషన్లో కాస్త కుదురుకుంది.
దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. కాగా, బిట్ కాయిన్ నేడు మరో ఆరు శాతం పతనమై 52,000 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ సోమవారం ఓ సమయంలో 50,848 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. బిట్ కాయిన్ ఈ ఏడాది 27,734 నుండి ఏకంగా 52వేల డాలర్లకు పెరిగింది. దాదాపు 90 శాతం లాభపడింది.
లాభాల్లోకి మార్కెట్లు
మార్కెట్లు నేడు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ కాస్త పుంజుకున్నప్పటికీ 50,000 పాయింట్లకు దిగువనే ఉంది. సెన్సెక్స్ ఉదయం 49,994.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,327.31 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,659.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు ఓ సమయంలో దాదాపు 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చింది. మధ్యాహ్నం గం.12.45 సమయానికి సెన్సెక్స్ పాయింట్లు ఎగిసి 49,860 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 44.55 పాయింట్లు లాభపడి 14,720 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 7.10 శాతం, టాటా మోటార్స్ 4.11 శాతం, హిండాల్కో 4.21 శాతం, గెయిల్ 3.47 శాతం, BPCL 3.37 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా 3.72 శాతం, అదానీ పోర్ట్స్ 1.60 శాతం, HDFC బ్యాంకు 1.47 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.38 శాతం, మారుతీ సుజుకీ 1.22 శాతం టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, హిండాల్కో ఉన్నాయి.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.30 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.13 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.67 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.51 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.59 శాతం, నిఫ్టీ ఐటీ 0.53 శాతం, నిఫ్టీ మీడియా 0.39 శాతం, నిఫ్టీ మెటల్ 2.49 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.65 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ బ్యాంకు 0.43 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.52 శాతం, నిఫ్టీ ఫార్మా 0.06 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 0.12 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.50 శాతం నష్టపోయాయి.