ఊగిసలాటలో మార్కెట్లు: ఓ వైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్
స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 7) దాదాపు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, మెటల్ స్టాక్స్ ఒత్తిడిలో ఉండగా, పవర్, ఐటీ స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. యుద్ధ ప్రభావంతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇది కూడా మార్కెట్ను కిందకు లాగుతోంది. రష్యా చమురు సరఫరాపై ఆంక్షలు విధిస్తే ముడి చమురు ధర 200 డాలర్లను క్రాస్ చేసి, 300 దిశగా వెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి.
అందుకే ఊగిసలాటలో
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఐదు రాష్ట్రాల్లో మూడు నుండి నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ జయకేతనం ఎగురవేయనుంది. ముఖ్యంగా యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా చూసిన ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును కాస్త బలపరిచింది. అయితే అననుకూల పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. దేశీయ ఎన్నికల ప్రభావం సానుకూలంగా, అంతర్జాతీయ ప్రభావం అననుకూలంగా ఉండటంతో ఊగిసలాటలో ఉన్నాయి.
ఊగిసలాటలో..
సెన్సెక్స్ నేడు 52,430 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,024 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,410 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,747 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,896 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,747 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11 సమయానికి 95 పాయింట్లు నష్టపోయి 52,747 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 15,822 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
ఉదయం సెషన్లో నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, టాటా స్టీల్, ఓఎన్జీసీ, మారుతీ సుజుకీ, జేఎస్డబ్ల్యు స్టీల్ ఉన్నాయి.