కనిష్టాల వద్ద కొనుగోళ్లు, ఉదయం లాభాల్లో మార్కెట్, సాయంత్రానికి నష్టాల్లో ముగింపు
స్టాక్ మార్కెట్ నేడు (ఫిబ్రవరి 23, బుధవారం) రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు నష్టాల్లో ముగిసింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 57,300 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నేడు ఉదయం లాభాల్లో ప్రారంభమైంది. అయితే స్వల్ప లాభాల్లోనే మధ్యాహ్నం గం.3 వరకు కొనసాగింది. ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ప్రధానంగా వరుసగా ఐదు రోజుల పాటు నష్టపోవడం, ముఖ్యంగా నిన్న సూచీలు కుప్పకూలిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు నేడు ఉదయం నుండి కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు. కానీ చివరి అరగంటలో మాత్రం మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. ఆటో, క్యాపిటల్ గూడ్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం 57,632.94 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,733.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,109.24 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,194.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,220.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,027.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 68.62 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టపోయి 57,232 పాయింట్ల వద్ద, నిఫ్టీ 28.95 పాయింట్లు లేదా 0.17 శాతం నష్టపోయి 17,063 పాయింట్ల వద్ద ముగిసింది.
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. అయితే మార్కెట్లు వరుసగా నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ఆసియా సూచీలు నేడు ఉదయం సానుకూలంగా కదలాడాయి. భారత్ సూచీలు కూడా కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో కాస్త లాభాల్లో కనిపించింది. అయితే సాయంత్రానికి కొనుగోళ్ల మద్దతు కోల్పోయి తిరిగి నష్టాల్లోకి వెళ్లింది. దీనికి తోడు ఉక్రెయిన్ పైన రష్యా ఆక్రమణలు ప్రారంభమయ్యయానే ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.