లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా జంప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 16) ఒడిదుడుకుల నుండి కోలుకొని, స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఆశాజనకంగా లేకపోవడం/ప్రతికూలంగా ఉండటంతో నిన్న కీలక రంగాల్లో షేర్ల అమ్మకాలు వెల్లువెత్తి, నష్టాల్లో ముగిశాయి. అయితే నేడు మార్కెట్లు స్థిరంగా లేదా స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, దేశీయ గణాంకాల ప్రభావంతో నిన్న ఒక్కరోజే భారీ నష్టాల్లో ముగియటంతో నేడు ప్రారంభం సెషన్లో స్థిరంగా ఉన్నాయి. అయితే మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ అంతకంతకూ ఎగిసి 300 పాయింట్లకు పైగా లాభపడింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.
లాభాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ ఉదయం 50,608.42 ప్రారంభమై, 50,857.98 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,448.98 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిన్న సెన్సెక్స్ 50,395 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఉదయం కాస్త సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు, అంతకంతకూ ఎగిసిపడ్డాయి. నిఫ్టీ 14,996.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,051.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,939.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 252.63 (0.50%) పాయింట్లు ఎగిసి 50,661.58 పాయింట్ల వద్ద, నిఫ్టీ 57.50 (0.39%) పాయింట్లు లాభపడి 14,991 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 3.89 శాతం, HCL టెక్ 2.21 శాతం, TCS 1.95 శాతం, ఇన్ఫోసిస్ 1.70 శాతం, టైటాన్ కంపెనీ 1.70 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో JSW స్టీల్ 1.65 శాతం, టాటా స్టీల్ 1.66 శాతం,
ఐచర్ మోటార్స్ 1.46 శాతం, కోల్ ఇండియా 1.26 శాతం, బీపీసీఎల్ 1.12 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టీసీఎస్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, రిలయన్స్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.34 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.11 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.22 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.40 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.11 శాతం, నిఫ్టీ మీడియా 0.39 శాతం, నిఫ్టీ మెటల్ 1.41 శాతం, నిఫ్టీ ఫార్మా 0.38 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.11 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.63 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.30 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.12 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.49 శాతం, నిఫ్టీ ఐటీ 1.77 శాతం లాభపడ్డాయి.