Akasa Air:బిగ్ బుల్ సంస్థకు కష్టాలు.. ప్రయాణికులను అప్రమత్తం చేసిన ఆకాశ సంస్థ.. ఏమైందంటే..
దివంగత రాకేష్ జున్జున్ స్థాపించిన దేశీయ సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కు కొత్త కష్టాలు వచ్చాయి. ప్రారంభమై నెలరోజులు కూడా కాక ముందే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలతో కూడిన డేటా లీక్ అయింది. ఈ బ్రీచ్ గురువారం జరిగినట్లు సంస్థ వెల్లడించింది.

ఇప్పటికే ఫిర్యాదు..
ఇటీవలి కాలంలో భారతీయ విమానయాన సంస్థలపై అనేక ఫిషింగ్ దాడులు జరిగాయి. ఇదే క్రమంలో మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఆకాశ డేటాను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ఈ క్రమంలో కంపెనీ హ్యాకింగ్ అండ్ ఫిషింగ్ వంటి సైబర్ సెక్యూరిటీ బెదిరింపులకు సంబంధించిన ప్రభుత్వ అఫీషియల్ నోడల్ ఏజన్సీ CERT-Inకి కంప్లెయింట్ చేసింది. దీనికి కారణం ఎవరనే దానిపై సదరు సంస్థ ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించింది.

వినియోగదారులకు హెచ్చరిక..
కంపెనీ తన కస్టమర్లకు ఫిషింగ్ ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం డేటా లీక్ అయినందున కస్టమర్లను మోసం చేసేందుకు వాటిని సైబర్ కేటుగాళ్లు వినియోగించే ప్రమాదం పొంచి ఉండటంతో ఎలాంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని ఆకాశ సంస్థ తమ ప్యాసింజర్లను కోరుతోంది.

సాంకేతిక లోపం..
లాగిన్ అండ్ సైన్-అప్ సేవకు సంబంధించిన తాత్కాలిక సాంకేతిక కాన్ఫిగరేషన్ లోపాన్ని గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. అనధికార వ్యక్తులకు కొంతమంది ప్రయాణీకుల పేర్లు, జండర్, ఈ-మెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్ లిక్ అయ్యాయని ప్రకటించింది. ఇలాంటి వాటి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని క్యారియర్ ప్రయాణికులకు హామీ ఇచ్చింది. లాగిన్ సేవలను తాత్కాలికంగా మూసేసిన సంస్థ కస్టమర్లకు దీనిపై క్షమాపణ చెప్పింది.


Click it and Unblock the Notifications