భారతదేశం తన బంగారం అవసరాల కోసం దశాబ్దాలుగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఏటా 800 టన్నులకు పైగా పసిడిని దిగుమతి చేసుకోవడం వల్ల మన విదేశీ మారక నిల్వలు భారీగా ఖర్చవుతున్నాయి. అయితే, ఈ పరిస్థితిని మార్చేలా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఒక భారీ మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని (Jonnagiri Gold Mine Project) మే నెలలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశ రక్షణ , ఆర్థిక రంగానికి కూడా ఒక వ్యూహాత్మక విజయంగా నిలవనుంది.

జొన్నగిరి ప్రాజెక్ట్ ప్రత్యేకతలు
జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్, సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో ఈ గనులు విస్తరించి ఉన్నాయి. దాదాపు రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ గనిలో ప్రాసెసింగ్ ప్లాంట్ను కేవలం 13 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం.
బంగారం (Gold) ఉత్పత్తి లక్ష్యాలు
ప్రస్తుతం భారతదేశంలో హట్టి గోల్డ్ మైన్స్ ద్వారా ఏడాదికి కేవలం 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) 2000 సంవత్సరంలో మూతపడిన తర్వాత దేశీయంగా పసిడి ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఇప్పుడు జొన్నగిరి ప్రాజెక్ట్ ద్వారా తొలి దశలో ఏడాదికి 1,000 కిలోల (1 టన్ను) స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గనిలో 13.1 టన్నుల నిల్వలు ఉన్నాయని, పరిశోధనలు కొనసాగితే ఇది 42.5 టన్నులకు చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఈ ప్రాజెక్ట్ విజయం ద్వారా రాబోయే పదేళ్లలో భారత్ ఏడాదికి 50 నుండి 100 టన్నుల బంగారాన్ని స్వదేశంలోనే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది తక్షణమే దిగుమతులను పూర్తిగా ఆపలేకపోయినా, దీర్ఘకాలంలో మన దేశీయ అవసరాలకు గట్టి మద్దతునిస్తుంది. అలాగే, మైనింగ్ రంగంలో మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులు రావడానికి ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్గా మారుతుంది. పారిశ్రామికాభివృద్ధితో పాటు స్థానిక గ్రామాల మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం , ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.
కేవలం గని మాత్రమే కాదు..
బంగారం (Gold) ధరలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మారుతున్న తరుణంలో, మన దేశంలోనే ఉత్పత్తి పెరగడం అనేది శుభపరిణామం. ఇది కేవలం ఒక గని మాత్రమే కాదు, భారతదేశం తన వనరులను సమర్థవంతంగా వాడుకుంటూ స్వయంసమృద్ధి సాధించే దిశగా వేస్తున్న బలమైన అడుగు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, భవిష్యత్తులో మన దేశం పసిడి రంగంలో ప్రపంచస్థాయిలో పోటీ పడగలదు. దీనివల్ల పరోక్షంగా రూపాయి విలువ బలపడటమే కాకుండా, మైనింగ్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఉన్న డిమాండ్ దృష్ట్యా, ఇలాంటి భారీ ప్రాజెక్టులు భారతదేశ వాణిజ్య లోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జొన్నగిరి గనిలో లభించే నిల్వలు రాబోయే 15 ఏళ్ల వరకు నిరంతరం ఉత్పత్తిని అందించగలవని అంచనా. స్థానిక ప్రజలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, వారిని ఈ రంగంలో భాగస్వామ్యులను చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది.
ఏదేమైనా దేశీయంగా బంగారం (Gold) తవ్వకాలు పెరగడం వల్ల మార్కెట్లోకి పసిడి సరఫరా పెరిగి, భవిష్యత్తులో ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేకపోలేదు. ఇది బంగారం ధరలపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications