320 కిలో మీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్.. భారత తొలి బుల్లెట్ స్పీడ్ రైలు పట్టాలెక్కేది అప్పుడే..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో తొలి బుల్లెట్ స్పీడ్ రైలు అతి త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. దీనిపై కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భారత్లో తొలి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ సేవలు 2027లో ప్రారంభం అవుతాయన్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు మొదటి దశలో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్లోని సూరత్-బిలిమోరా విభాగంలో ప్రారంభం కానుందని తెలిపారు. అనంతరం మిగతా మార్గాలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.
508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (MAHSR) కారిడార్లోని సూరత్-బిలిమోరా మార్గంలో మొదటగా ప్రయాణికులకు.. ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన విభాగాలైన వాపి-సూరత్, వాపి-అహ్మదాబాద్, అహ్మదాబాద్-థానే, చివరగా పూర్తి ముంబై-అహ్మదాబాద్ మార్గాలను నిర్మాణం సాగే కొద్దీ దశలవారీగా ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఐటీ సదస్సు (HYSEA GCCS & IT రౌండ్టేబుల్) లో ఆయన ఈ కలకమైన విషయాలను వెల్లడించారు. పూర్తి స్థాయిలో ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టుతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాలను కలుపుతూ మరో మూడు కొత్త హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని.. దీనివల్ల హైదరాబాద్ నగరం ఒక ప్రధాన హై-స్పీడ్ రైలు కేంద్రంగా (హబ్) ఆవిర్భవించనుందని మంత్రి తెలిపారు. పూణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు రూట్లలో రానున్న ఈ కారిడార్లు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నాయి.
కొత్త మార్గాల ద్వారా పూణే-హైదరాబాద్ ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే అయిపోతుంది. అలాగే హైదరాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 50 నిమిషాలు, హైదరాబాద్-అమరావతికి 1 గంట 10 నిమిషాలు, చెన్నైకి 3 గంటలు, బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చని వైష్ణవ్ వివరించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను ఏకీకృతం చేయడంతో పాటు, పర్యాటకాన్ని పెంచి, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ రవాణా రంగంలో గేమ్ ఛేంజర్ గా నిలుస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
రైల్వే రంగానికి అదనంగా.. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ తయారీ కార్యక్రమాల వల్ల కూడా తెలంగాణ రాష్ట్రం భారీగా లబ్ధి పొందిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కేంద్ర రాయితీల ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 100కు పైగా ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని చెప్పారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రికార్డు స్థాయిలో 5,400 కోట్ల రూపాయలను కేటాయించిందని.. ఈ నిధుల వల్ల రాష్ట్ర రవాణా రంగ రూపురేఖల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications
