హైదరాబాద్-బెంగళూరు 2 గంటల్లో.. 73 నిమిషాల్లో బెంగళూరు-చెన్నై.. కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లు వస్తున్నాయ్..
భారతదేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను అనుసంధానించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఏడు కొత్త హై-స్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్లకు ఆమోదం తెలపడం ద్వారా రైల్వే మౌలిక సదుపాయాల రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. దేశంలోని పశ్చిమ, దక్షిణ, ఉత్తర, తూర్పు ప్రాంతాలలోని ముఖ్యమైన ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక మరియు పర్యాటక కేంద్రాలను కలుపుతూ ఈ విస్తృతమైన నెట్వర్క్ను రూపొందించనున్నారు.
జపాన్ సాంకేతిక, ఆర్థిక సహాయంతో షింకన్సెన్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తున్న 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ మొట్టమొదటి Bullet Train ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉండగానే, కేంద్రం ఈ ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ఈ కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రోడ్డు, వాయు రవాణాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా వివిధ నగరాల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోతుంది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా గుర్తించిన ఏడు కారిడార్లలో ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మార్గాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదిత నెట్వర్క్ వల్ల ఆయా నగరాల మధ్య ప్రయాణ వేగం అద్భుతంగా పెరగనుంది. కొత్త మార్గాల అంచనా ప్రకారం.. ముంబై నుండి అహ్మదాబాద్కు 1 గంట 57 నిమిషాలు, ముంబై నుండి పూణేకు కేవలం 48 నిమిషాలు మాత్రమే పడుతుంది.
అలాగే దక్షిణ భారతదేశంలో బెంగళూరు-చెన్నై మధ్య 73 నిమిషాలు, బెంగళూరు-హైదరాబాద్ మధ్య 2 గంటల 10 నిమిషాలు, పూణే-హైదరాబాద్ మధ్య 2 గంటల 8 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణించవచ్చు. ఉత్తర భారతదేశ విషయానికి వస్తే.. ఢిల్లీ నుండి లక్నోకు 2 గంటలు, ఢిల్లీ నుండి వారణాసికి 3 గంటల 15 నిమిషాలు మరియు ఢిల్లీ నుండి సిలిగురికి సుమారు 6 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ మెగా ప్రాజెక్ట్ విస్తరణ ద్వారా బీహార్, తూర్పు భారతదేశం కూడా భారీగా లబ్ధి పొందనున్నాయి. ఢిల్లీ-వారణాసి-పాట్నా బుల్లెట్ రైలు కారిడార్కు ఆమోదం లభించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మార్గం పూర్తయిన తర్వాత పాట్నా నుండి ఢిల్లీకి ప్రయాణ సమయం కేవలం 4 గంటల 41 నిమిషాలకు తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ కారిడార్ను తూర్పున ఉన్న సిలిగురి వరకు మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రూ. 1.15 లక్షల కోట్లకు పైగా విలువైన రైల్వే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే ఏడు నుంచి ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి 200కు పైగా కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఛప్రా జంక్షన్ - ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య కొత్త వారపు రైలుతో పాటు మౌల్-ఢిల్లీ, జహీర్ఘాట్-వారణాసి మధ్య మరో రెండు రైలు సర్వీసులను కూడా వర్చువల్గా ప్రారంభించారు.
పాలనాపరంగా ఈ ఏడు కొత్త కారిడార్ల ఆమోదం ఒక పెద్ద ముందడుగు అయినప్పటికీ.. వీటి నిర్మాణానికి సంబంధించిన ఖచ్చితమైన కాలపరిమితులను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించడానికి ముందు ప్రతి మార్గానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనాలు (Feasibility Studies), చట్టబద్ధమైన అనుమతులు, నిధుల సమీకరణ మరియు భూసేకరణ వంటి సుదీర్ఘ ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ముంబై-అహ్మదాబాద్ లైన్ విజయవంతంగా పూర్తి కావడం భవిష్యత్ ప్రాజెక్టులకు దిక్సూచిగా మారనుందని, ఈ కొత్త కారిడార్లు గనుక ప్రణాళికాబద్ధంగా పూర్తయితే దేశీయ రవాణా రంగ స్వరూపమే మారిపోయి ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన, సురక్షితమైన ఆధునిక ప్రయాణ అనుభూతి లభిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications
