IT News: టెక్ బబుల్ పగిలిపోనుందన్న స్టార్టప్ సీఈవో.. నయా ఉద్యోగాల మాట మర్చిపోవాల్సిందేనా..?
IT News: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు దశాబ్ధకాలంలో ఎప్పుడూ చూడని పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ ఇప్పటి వరకు కొనసాగించిన టెక్ బూమ్ బబుల్ పగిలిపోవచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో చాలా కంపెనీలు కొత్త నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో భారతీయ స్టార్టప్ కంపెనీలు సైతం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
జోహో స్టార్టప్..
టెక్ స్టార్టప్ జోహో సీఈవో శ్రీధర్ వెంబూ మాట్లాడుతూ టెక్ బబుల్ పగిలిపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా కంపెనీ కొత్త నియామకాలను నిలిపివేసింది. అయితే జూలై మాసంలో తమ దేశీయ, అంతర్జాతీయ వ్యాపార అవసరాల కోసం ఏకంగా 2000 మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ దానిని తాత్కాలికంగా విరామం ప్రకటించింది.
కంపెనీ వ్యాపారం..
SaaS సేవలను అందించే కంపెనీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. 2021 సంవత్సరానికి గాను కంపెనీ వార్షిక ఆదాయం ప్రపంచ వ్యాప్తంగా 77 శాతం పెరిగి 1 బిలియన్ డాలర్ల మార్కును దాటిందని సీఈవో వెల్లడించారు. అయితే ఈ ఏడాది ఆర్థిక మందగమనం కారణంగా వ్యాపారం నమ్మదించిందని.. ఇలాంటి పరిస్ధితులను ఎవ్వరూ కోరుకోరని చెప్పుకొచ్చారు.
ఖర్చుల తగ్గింపు..
చెన్నై, టెక్సాస్కు చెందిన జోహో ప్రస్తుతం 55 కంటే ఎక్కువ ఎంటర్ప్రైజ్ టెక్ ప్లాట్ఫారమ్ క్లైంట్లను కలిగి ఉంది. ఈ క్రమంలో కంపెనీ తన మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం కంపెనీ R&D కోసం వెచ్చిస్తున్నదానిలో కేవలం మూడోవంతు మాత్రమే మార్కెటింగ్ పై ఖర్చు చేస్తోంది. గత వారం కంపెనీ ఇందులో భాగంగా 10 శాతం సిబ్బందిని తొలగించింది. ఇదే క్రమంలో Meta, Twitter, Stripe, Salesforce, Coinbase, Lyft, Shopify వంటి ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తగ్గించటం ప్రారంభించాయి.