Stock Market: సందిగ్ధంలో దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొన్ని లాభాల్లో మరికొన్ని నష్టాల్లో..
Stock Market: కొత్త వారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతాయని అందరూ ఆశించారు. అయితే కొన్ని సూచీలు లాభాల్లో ఉండగా.. మరికొన్ని మాత్రం నష్టాల్లో ఉన్నాయి.
మార్కెట్ సూచీలు..
ఈరోజు మార్కెట్లను గమనిస్తే ఉదయం 9.55 గంటల సమయంలో కీలక బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 238 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. మరో కీలక సూచీ నిఫ్టీ 95 పాయింట్ల నష్టంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 60 పాయింట్ల లాభాల్లో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 26 పాయింట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి. గతవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో.. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
టాప్ గెయినర్స్..
NSE సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరోమోటొకార్ప్, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, ఎస్బీఐఎన్ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.
టాప్ లూజర్స్..
ఈ క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, మారుతీ, నెస్లే, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ తో పాటు హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
రిజర్వు బ్యాంక్..
RBI ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. మార్కెట్ నిపుణులు అంచనా ప్రకారం రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను ఈ సారి సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చని తెలుస్తోంది. అయితే బుధవారం దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. దీంతో మార్కెట్ రిజర్వు బ్యాంక్ ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. దీనికి తోడు ఫెడ్ ఛైర్మన్ పావెల్ మంగళవారం ప్రసంగించనున్నారు. ఆయన మాటలు మార్కెట్లకు దిక్సూచిగా మారతాయని.. ద్రవ్యోల్బణంపై కొత్త సమాచారం అందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.