Saturday Trading: భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల డీమ్యాట్ ఖాతాల పెరుగుతున్న ధోరణి రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ గురించి ప్రతిబింబిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు స్టాక్ మార్కెట్లు సంసిద్ధం అవుతున్నాయి.
దీంతో మే 18న అంటే శనివారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రత్యేకంగా లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్నాయి. దీనికి ముందు సైతం ఇలాంటి స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ను స్టాక్ మార్కెట్లు మార్చి 2న నిర్వహించాయి. అనుకోని డిజాస్టర్లను ఎదుర్కొనేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా తాజా చర్యలు వచ్చాయని పేర్కొంది. దీనికింద నిర్వహించే స్పెషల్ ట్రేడింగ్ సెషన్ మెుత్తం రెండుగా విభజించబడింది. మొదటి ట్రేడింగ్ సెషన్ ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ఉండనుండగా.. రెండవ సెషన్ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగనుంది.

మే 18న జరగనున్న స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సమయంలో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలో ట్రేడింగ్ జరపబడుతుంది. ఈ స్వల్పకాలిక ట్రేడింగ్ సమయంలో ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్కి ఇంట్రాడే స్విచ్ఓవర్ ఉండనుంది. సభ్యులందరూ దీనిని గమనించాలని ఎన్ఎస్ఈ తన సర్క్యులర్లో పేర్కొంది. ఈ స్పెషల్ ట్రేడింగ్ సమయంలో సెక్యూరిటీలు, డెరివేటివ్స్ కేటగిరీల్లో గరిష్ఠంగా 5 శాతం సర్క్యూట్ లిమిట్స్ కలిగి ఉంటాయని ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. క్లోజ్-ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ 5 శాతం ధర బ్యాండ్ను కలిగి ఉండగా, అన్ని ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 5 శాతం రోజువారీ నిర్వహణ పరిధితో పనిచేస్తాయని వెల్లడించింది.
వాస్తవానికి స్పెషల్ ట్రేడింగ్ సెషన్లను జనవరి 20న ప్రకటించాయి దేశంలోని ప్రముఖ ఎక్స్ఛేంజీలు. ఇప్పటికే ఒక సారి నిర్వహించిన ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ సమయంలో విజయవంతంగా ట్రేడింగ్ స్విచోవర్ నిర్వహించబడింది. ఏదైనా ఊహించని సంఘటన ఎదురైతే మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల సంసిద్ధతను అంచనా వేయడం ఈ సెషన్ ఉద్దేశమని ఎన్ఎస్ఈ వెల్లడించింది. నిర్ణీత వ్యవధిలోగా డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి కార్యకలాపాలను పునరుద్ధరించడం లక్ష్యంగా తాజా స్పెషల్ ట్రేడింగ్ ట్రైల్ నిర్వహించబడుతోంది.


Click it and Unblock the Notifications