Stock Market: వరుస సెలవుల తరువాత ఓలటాలిటీ.. మార్కెట్లకు US ద్రవ్యోల్పణం భయం.. ఊగిసలాటలో..
Stock Market Opening Bell: శుక్రవారం మంచి లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస సెలవుల తరువాత ఈ రోజు నెగటివ్ మోడ్ లో ప్రారంభమయ్యాయి. రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు ప్రకటన చేసిన తరువాత అనూహ్యంగా మార్కెట్లు ముందుకు సాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి పెట్టుబడుల రాక ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు ఆశాజనకంగా లేనందున ఆసియా మార్కెట్లను కొంత మేర ప్రభావితం చేస్తున్నాయి. ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఈ తరుణంలో ఉదయం 9.25 గంటలకు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ నష్టాల నుంచి కోలుకుని కేవలం 75 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో బెంచ్ మార్కె సూచీ నిఫ్టీ-50.. 24 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 133 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 38 పాయింట్లు లాభపడి ముందుకు సాగుతున్నాయి.
ఈ సమయంలో కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్ స్టాక్స్ ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి. అయితే అమెరికా మార్కెట్లు ద్రవ్యోల్బణం డేటా కారణంగా నష్టాలను చవిచూడటంతో ఆసియా మార్కెట్లపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇదే సమయంలో డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ స్వల్పంగా బలపడింది. డాలర్ కొంత బలహీనంగా ట్రేడ్ అవుతోంది. ఉదయం ఆరంభ ట్రేడింగ్ లో ఓలటాలిటీ కారణంగా కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, సన్ ఫార్మా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, భారతీ పెట్రోలియం, సిప్లా, కోల్ ఇండియా, ఎయిర్ టెల్, రిలయన్ ఇండస్ట్రీస్ స్టాక్స్ లాభాల్లో నిలిచి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో యస్ బ్యాంక్, ఇండస్ టవర్స్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్, విప్రో, వేదాంత, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ స్టాక్ నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.