Stock Market: మార్కెట్లలో పండుగ జోరు.. పరుగులు తీస్తున్న బుల్.. రికార్డ్ లాభాలతో ముందుకు..
Stock Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లలో పండుగ కోలాహలం కనిపించింది. ఉదయం ఆరంభంలోనే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,100 పాయింట్లు లాభపడింది. ఇదే సమయంలో నిఫ్టీ 17,200 పాయింట్ల మార్క్ దాటింది. దీంతో అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఆరంభంలో..
మార్కెట్ల ప్రీ ఓపెన్ సెషన్లో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 600 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల గ్యాప్ అప్ తో ప్రారంభమయ్యాయి. ఆ జోరు అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 1036 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 302 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 956 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 425 పాయింట్ల మేర లాభపడ్డాయి.
ప్రధాన కారణాలు..
బ్రిటన్ లో అధిక ఆదాయాలు ఆర్జించే సంపన్నులకు భారీగా పన్ను తగ్గించేందుకు ఉద్దేశించిన విధానాన్ని అక్కడి ప్రభుత్వం ఉపసమహరించుకుంది. దీనిపై గతవారం ఐఎంఎఫ్ కూడా స్పందిస్తూ.. ఇది సమాజంలో అంతరాయాన్ని పెంచుతుందని వ్యాఖ్యానించింది. దీనికి తోడు ఆసియా పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా ఉండటం కలిసొచ్చిన అంశాలుగా చెప్పుకోవాలి.
టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, జేఎస్డబ్యూ తో పాటు ఇతర స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అయితే ఇదే సమయంలో కేవలం డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్ స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉంటూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.