Stock Market: చివరి రోజు దుమ్మురేపిన Sensex @ 1031.. బుల్స్ లాభాల రంకెలు అందుకే..
Stock Market Closing: ఆర్థిక సంవత్సరం చివరి రోజుతో పాటు నెలాఖరున దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు అదే జోరును చివరి వరకు కొనసాగించాయి.
మార్కెట్లు క్లోజింగ్ సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1031 పాయింట్లకు పైగా లాభపడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 272 పాయింట్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 679 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 235 పాయింట్ల లాభంలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీగా లాభాలను నమోదు చేశాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు బ్యాంకింగ్, ఐటీ రంగాలు ముందుకు నడిపాయి. ఈ క్రమంలో దేశీయ ఇన్వెస్టర్లు రెండు నెలలకు ఒకసారి నిర్వహించే మానిటరీ పాలసీ నిర్ణయాల కోసం వేచి ఉన్నారు. దీనికి తోడు భారత కరెంట్ లోటు మెరుగుపడటం, అమెరికా జీడీపీ వృద్ధికి సంబంధించిన వివరాలు మార్కెట్లోకి విడుదల కావటం వంటి కీలక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి.
ఈరోజు మెుత్తం మార్కెట్లోని 3,590 షేర్లలో 2,534 షేర్లు లాభపడ్డాయి. 955 స్టాక్స్ పతనమవగా, 101 ఎలాంటి మార్పును చూడలేదు. సెన్సెక్స్ సూచీలో హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు సైతం టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ రూ.26.96 బిలియన్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోవటంతో భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు దాదాపు 7 శాతం మేర లాభపడింది.
ఇదే సమయంలో సూచీలోని అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్స్గా నిలిచాయి.


Click it and Unblock the Notifications